విశాఖ స్టీల్ప్లాంట్పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. బుధవారం విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన ఉక్కు పరిశ్రమ కార్మిక సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వ సంస్థ అని ఆయన పేర్కొన్నారు. విశాఖ ఉక్కు సంస్థతో ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా ప్రైవేటీకరణ చేయొద్దంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని జగన్ తెలిపారు.
ఈ సందర్భంగా స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కార్మిక సంఘాల నేతలు కోరారు. వారి విజ్ఞప్తికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని తెలిసింది. ఎన్ఎండీసీని విశాఖ ఉక్కు సంస్థతో అనుసంధానించాలని, దీంతో సొంత గనుల సమస్య తీరుతుందని, ఇందుకు కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. దాదాపు గంటపాటు వీరి భేటీ కొనసాగింది. పలువురు మంత్రులతోపాటు, ఎంపీ విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యేలు సీఎం జగన్ వెంట ఉన్నారు.