పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌.వాణీదేవి విజయం

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌.వాణీదేవి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుపై వాణీదేవి గెలుపొందారు. వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,12,689 పోలవ్వగా రెండో ప్రాధాన్యతగా 36,580 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1,49,269 ఓట్లతో వాణీదేవి విజయఢంకా మోగించారు. బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకి 1,19,198 ఓట్లు వచ్చాయి. రామచందర్‌రావు ఓటమితో బీజేపీ సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయింది. వాణీదేవి గెలుపుతో తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జ‌రిపాయి. ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్‌, గోపినాథ్‌, ఎమ్మెల్సీ శ్రీ‌నివాస్‌రెడ్డి, మాజీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ త‌దిత‌రులు ఈ సంబురాల్లో పాల్గొన్నారు.