ప్రైవేట్‌ టీచర్లకు 2వేలు, 25కిలోల బియ్యం: సీఎం కేసీఆర్‌

ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి సీఎం కేసీఆర్‌ శుభవార్త‌ చెప్పారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి సాయం ప్రకటించారు. విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించేంతవరకు రూ.2000, వారి కుటుంబాలకు 25 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాలని నిర్ణయించారు. గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బందికి ఏప్రిల్ నెల నుంచి ఈ సాయం అందనుంది.

ఇందుకు సంబంధించి ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సీఎం తెలిపారు.

రేపు ఉదయం 11:30 గంటలకు బీఆర్‌కే భవన్లో ఇందుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మను సీఎం ఆదేశించారు. ఈ వీడియో కాన్పరెన్సులో అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు విద్యాశాఖ డిఈఓలు పౌరసరఫరాల శాఖ డిఎస్ ఓ లు ఇతర సిబ్బంది పాల్గొంటారు. ఇందుకు సంబంధించి విధి విధానాలను, కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం ఆదేశాలు జారీ చేయనున్నారు.

ప్రయివేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు లక్షా 50 వేల మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి లబ్ధిచేకూరుతుంది.