తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 8 వేల క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతున్న‌ది. కొత్త‌గా 8 వేల‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. శ‌నివారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా మ‌రో 8126 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. కొత్త‌గా 38 మంది వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించ‌గా, 3307 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,95,232కు చేరింది. ఇందులో 62,929 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌రో 3,30,304 మంది క‌రోనా నుంచి కోలుకోగా, 1999 మంది మ‌ర‌ణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాల రేటు 0.50 శాతంగా ఉండ‌గా, రిక‌వ‌రీ రేటు 83.57 శాతంగా ఉన్న‌ది.

కొత్త‌గా న‌మోదైన‌ పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 1259 కేసులు ఉండ‌గా, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లాలో 676, రంగారెడ్డి జిల్లాలో 591, నిజామాబాద్‌లో 497, న‌ల్ల‌గొండ‌లో 346, ఖ‌మ్మ‌లో 339, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 334, సిద్దిపేట‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లో 306, క‌రీంన‌గ‌ర్లో 286, జ‌గిత్యాలలో 264, మంచిర్యాలలో 233, సంగారెడ్డిలో 201 చొప్పున న‌మోద‌య్యాయి. రాష్ట్రంలో నిన్న 1,08,602 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దీంతో మొత్తం క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య 1,24,93,399కి చేరింది.