శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపం వద్ద వారికి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు. ఆలయ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అటునుంచి జస్టిస్‌ ఎన్వీ రమణ తిరుచానూరు వెళ్లనున్నారు. పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. నిన్న రాత్రి శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్నారు.