కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీటి ఇబ్బందులు ఉన్నాయని.. 100 శాతం కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు (కేసీఆర్) తెలిపారు. జిల్లాల పర్యటనల్లో భాగంగా ఆదివారం సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఆయన పర్యటించారు. కామారెడ్డిలో నూతన కలెక్టరేట్ను సీఎం ప్రారంభించారు. కేసీఆర్ వెంట స్పీకర్ పోచారం, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఉన్నారు.
అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధుల సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామారెడ్డి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది కామారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీస్స్టేషన్ కూడా మంజూరు చేస్తామన్నారు. కామారెడ్డి జిల్లాలోని గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు. తెలంగాణలో కరెంట్ కొరత లేకుండా చేశామని సీఎం అన్నారు.