ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను ఎదుర్కోవటమే మానవాళిముందున్న అతిపెద్ద సవాల్ అని యూ.ఎస్ ఎయిడ్ మిషన్ డైరెక్టర్ వీణా రెడ్డి అన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ (యుఎస్ఏఐడి) అరణ్య భవన్ లో జరిగిన ఫారెస్ట్ ప్లస్ 2.0 సమీక్షా సమావేశానికి ఆమెతో పాటు ఇతర ప్రతినిధుల బృందం హాజరయ్యారు.భారతదేశంలోమూడు రాష్ట్రాల్లోని మూడు జిల్లాల్లో యూ.ఎస్ ఎయిడ్ ఫారెస్ట్ ప్లస్ 2.0 అమలు చేస్తోంది. తెలంగాణలో మెదక్ జిల్లాతో పాటు బీహార్, కేరళ రాష్ట్రాలు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. భౌగోళిక మార్పులను ఎదుర్కొనేందుకు వీలుగా స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అడవుల పునరుద్దరణ, జీవవైవిధ్యం కాపాడటం ఫారెస్ట్ ప్లస్ ప్రత్యేకత.
మెదక్ జిల్లాలో చేపట్టిన ఫారెస్ట్ ప్లస్, గత మూడేళ్ల పురోగతిపై అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (కంపా), నోడల్ ఆఫీసర్ లోకేష్ జైస్వాల్ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.తెలంగాణలో అటవీ పునరుద్దరణ పనుల పర్యవేక్షణకు క్షేత్ర స్థాయిలో జిల్లాల్లో పర్యటించాలని యూ.ఎస్ ఎయిడ్ బృందాన్ని పీసీసీఎఫ్ఆర్.శోభ ఆహ్వానించారు. అలాగే ఫారెస్ట్రీ మేనేజ్ మెంట్, అమెరికా పద్దతులు, కొత్త టెక్నాలజీని అధ్యయనం చేసేందుకు తెలంగాణ అధికారుల బృందం అమెరికా పర్యటించేలా చూడాలని కోరారు. అందుకు వీణా రెడ్డి అంగీకరించారు.
అలాగే పర్యావరణ మార్పులు,అంతర్జాతీయ ఒప్పందాల మేరకు తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేసేందుకు యూ.ఎస్ ఎయిడ్ తరపున తెలంగాణలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాల్సిందిగా ఫారెస్ట్ ప్లస్ నోడల్ ఆఫీసర్ లోకేష్ జైస్వాల్ కోరారు. సమావేశంలో వర్గీస్ పాల్, సీనియర్ ఫారెస్ట్రీఅడ్వయిజర్, యూ.ఎస్. ఎయిడ్, వంశీధర్ రెడ్డి, డెవలప్ మెంట్ స్పెషలిస్ట్ (అగ్నికల్చర్), మార్తా వాన్ లీయిసౌట్, సీనియర్ డెవలప్ మెంట్, కమ్యూనికేషన్స్ ఆఫీసర్, వినయ్ కుమార్, అడిషనల్ పీసీసీఎఫ్, సీ. శరవనన్, మెదక్ చీఫ్ కన్జర్వేటర్ , జీ.సాయిలు, రీజనల్ డైరెక్టర్, ఫారెస్ట్ ప్లస్ 2.0 తెలంగాణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.