అటవీ నర్సరీలో అక్రమాలు

హరిత తెలంగాణే లక్ష్యంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన అటవీ శాఖ నర్సరీల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. వెల్దుర్తి మం డల పరిధిలోని మంగళపర్తి సెక్షన్‌లోని అందుగులపల్లి గ్రామశివారులో అటవీ శాఖ ఆధ్వర్యంలో మూడు లక్షల సామర్థ్యం గల నర్సరీలను ఏర్పాటు చేసింది. నర్సరీ నిర్వహణలో ముందుగా 47 సైజు పాలిథిన్‌ కవర్లలో వేర్లు లేదా విత్తనాలు వేసి నాటుతారు. ఆ మొక్కలు సుమారు 50 సెంటీమీటర్లు(ఫీటున్నర) ఎత్తు పెరిగిన తరువాత మొక్క లను 911 సైజు పాలిథిన్‌ కవర్‌లోకి మార్చుతారు. ఈ మొక్కలను మార్చే పద్ధ్దతిని కన్వర్షన్‌ అంటారు. కన్వర్షన్‌ చేసిన మొక్కలు విరిగిపోకుండా, వంగిపోకుండా ఉండడం కోసం మొక్కలకు వెదురు కర్రలను సపోర్టుగా పెడుతారు. పెరిగిన మొక్కలను హరితహారం లేదా అటవీలో నాటేం దుకు తరలిస్తారు. ఇది నర్సరీలో చేపట్టాల్సిన పని. పనులు పూర్తయిన తర్వాత ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో అధికారులకు బిల్లులు వస్తాయి. కానీ, అందుగులపల్లి అటవీ నర్సరీలో ఈ నిబంధనలు పాటించడం లేదు. మంగళపర్తి సెక్షన్‌ అధికారి ధన్‌సింగ్‌ కనుసన్నల్లో నర్సరీ నిర్వహణ జరుగుతున్నది. నర్సరీలో కనీస నిర్వాహణ లేదు. నేరుగా పెద్ద సైజు పాలిథిన్‌ కవర్లలోనే మొక్కలు నాటి పెంచుతున్నారు. ఈ నర్సరీలో మూ డు లక్షల మొక్కలను గతేడాది డిసెంబర్‌లో నాటిన అధికారులు, గత జూ న్‌, జూలై నెలల్లో వాటిని కన్వర్షన్‌ చేసినట్లు రికార్డుల్లో చూపించారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో 75 వేల మొక్కలను గత జూన్‌లో నాటి, వాటిని ప్రస్తుతం కన్వర్షన్‌ చేస్తున్నట్లు అటవీ అధికారుల వివరణ. కాగా, మొదటగా నాటిన మూ డు లక్షల మొక్కల్లో సుమారు 60 శా తం మొక్కలు ఫీటు కంటే తక్కువ సైజు లో ఉండగా, వాటిని కన్వర్షన్‌ చేసి నట్లు రికార్డుల్లో చూపించి బిల్లులు తీసుకున్నారు. ప్రస్తుతం కన్వర్షన్‌ చేస్తున్నట్లు చెబుతున్న 75 వేల మొక్కల్లో చాలావరకు మొక్కలు ఎదగనే లేదు. చిన్నసైజు కవర్లలో మొక్కలు నాటకుండానే, నాటినట్లు చూపి సుమారు ఆరునెలల పాటు వాటి నిర్వహణతో పాటు ఇతర బిల్లులు తీసుకొని మళ్లీ వా టిని పెద్ద సైజు బ్యాగుల్లో కన్వర్షన్‌ చేసినట్లు చూపి వాటి బిల్లులు సైతం తీసుకున్నారు. మొక్కలకు సపోర్టుగా పెట్టడానికి ఉపయోగించేందుకు మూడు లక్షల వెదురు కర్రలకు రూ.లక్షల్లో బిల్లులు చేసి తీసుకున్న అధికారులు, అందులో సగమైనా నర్సరీల్లో ఉండకపోవడం గమనార్హం. కాగా, ఒక్క మొక్కకు కూడా కర్రలను కట్టకపోవడం శోఛనీయం. ప్రస్తు తం ఉన్న కర్రల్లో సగం వరకు కర్రలు గతంలో వినియోగించినవే ఉన్నవని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం కోసం వేలకోట్ల రూపాయలను ఖర్చు చేస్తుండగా, ఇలాంటి నిర్లక్ష్యపు, అవినీతి అధికారులతో ఎంతో విలువైన ప్రజల సొమ్ము అక్రమార్కుల పాలవుతున్నది. ఈ విషయమై వివరాల కోసం నర్సరీ ఇన్‌చార్జి, మంగళపర్తి సెక్షన్‌ అఫీసర్‌ ధన్‌సింగ్‌ను ఫోన్‌లో సంప్రదించగా, పొంతనలేని సమాధానాలు చెబుతూ, అసభ్యంగా మాట్లాడుతూ ఫోన్‌ను కట్‌ చేశారు.

విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం…
అందుగులపల్లి అటవీ నర్సరీ నిర్వహణపై మాకు ఫిర్యాదు వచ్చింది. క్షేత్రస్థాయిలో పర్యటించి, విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదికను అందించాలని జిల్లా ఫ్లయింగ్‌ స్కాడ్‌ డీఎఫ్‌వోను ఆదేశించారు. విచారణ అనంతరం వచ్చే నివేదిక ఆధారంగా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం. అటవీశాఖలో సిబ్బంది నిర్లక్ష్యం, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు.
– శరవణన్‌, అటవీ శాఖ సీసీఎఫ్‌