పర్యావరణహిత తిరుమల తిరుపతి దేవస్థానం

దేశంలోని పర్యాటక, యాత్రా స్థలాలను పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) సంకల్పించింది. ఇందులో భాగంగా ‘నెట్‌ జీరో ఎనర్జీ టూరిజం డెస్టినేషన్‌’ ప్రాజెక్టుకు మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, జమ్మూ కశ్మీర్‌లలోని పర్యాటక ప్రాంతాలతో పాటు ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ను ఎంపిక చేసింది. ఇంధన సామర్థ్యానికి తీసుకోవాల్సిన చర్యలపై నెడ్‌క్యాప్‌తో కలిసి బీఈఈ అధ్యయనం చేయనుంది. ఆ తర్వాత ఇంధన సామర్థ్యం కలిగిన వాటర్‌ పంపింగ్‌ సిస్టమ్, ఫ్యాన్లు, లైట్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను బీఈఈ సౌజన్యంతో ఇంధన పరిరక్షణ మిషన్‌ ఆధ్వర్యంలో టీటీడీ అధికారులు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వ సహకారంతో తిరుమలను కాలుష్య రహితంగా, పర్యావరణ హిత, ఇంధన సామర్థ్య పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. తిరుపతిలోని కళాశాలలు, పాఠశాలలు, తిరుమలలోని టీటీడీ భవనాల్లో 2.2 మెగావాట్ల రూఫ్‌ టాప్‌ సోలార్‌ సిస్టమ్, పవన విద్యుత్‌ ప్రాజెక్టులు, బయోగ్యాస్‌ ప్లాంట్లు, విద్యుత్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్లు  ఏర్పాటు చేయడానికి నెడ్‌ క్యాప్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  
భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీలో సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈవో జవహర్‌రెడ్డి చెప్పారు.