టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుల జాబితా విడుదల

వివిధ కారణాలతో చాలాకాలంగా వాయిదాపడుతూ వస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎట్టకేలకు పూర్తిచేశారు. బుధవారం ఈ మేరకు జిల్లా అధ్యక్షుల జాబితా విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను ఎంపిక చేశారు. పార్టీ నూతన అధ్యక్షులుగా ఎంపికైన నేతలను మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు అభినందించారు.

సీఎం కేసీఆర్‌ను కలిసిన వివిధ జిల్లాల కొత్త అధ్యక్షులు 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమిం చిన నేపథ్యంలో పలు జిల్లాల అధ్యక్షులు సీఎం కేసీఆర్ ను బుధవారం ప్రగతిభవన్‌లో కలిశారు. బడుగుల  లింగయ్య యాదవ్‌ (సూర్యాపేట), రామకృష్ణారెడ్డి (యాదాద్రి), రమావత్‌ రవీంద్రకుమార్‌ (నల్లగొండ) కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. వీరివెంట మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు తదితరులున్నారు. దాస్యం వినయ్‌భాస్కర్‌ (హన్మకొండ), ఆరూరి రమేశ్‌ (వరంగల్‌), మాలోత్‌ కవిత (మహబూ బాబాద్‌) కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, యాదగిరిరెడ్డి కూడా కేసీఆర్‌ను కలిశారు. గువ్వల బాలరాజు (నాగర్‌కర్నూలు) వెంట మంత్రి  నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రగతిభవన్‌కు వచ్చారు. ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన తాతా మధుసూదన్, భద్రాద్రి కొత్త గూడెం అధ్యక్షుడు ఎమ్మెల్యే కాంతారావు కూడా సీఎంను కలిశారు.