నుమాయిష్ లో అటవీశాఖ స్టాల్ కు ప్రథమ బహుమతి

హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్) నుమాయిష్ లో తెలంగాణ అటవీ శాఖ తరపున ఏర్పాటు చేసిన స్టాల్ కు ప్రథమ బహుమతి దక్కింది. ఈ ఎగ్జిబిషన్ లో పలు ప్రభుత్వ శాఖలు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశాయి. అటవీశాఖ ఏర్పాటు చేసిన స్టాల్  తెలంగాణకు హరితహారం ద్వారా  అటవీ శాఖ గత ఏడేళ్లుగా అమలు చేస్తున్న పర్యావరణ హిత కార్యక్రమాలను ప్రతిబింబించింది. అలాగే పచ్చదనం పెంపు, జంతు సంరక్షణ చర్యల నమూనాలను ఈ ప్రదర్శనలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

అడవి థీమ్ తో ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారంతో పాటు, పిల్లల కోసం ఏర్పాటు చేసిన మినీ జూ కూడా సందర్శకులను పెద్ద సంఖ్యలో ఆకట్టుకుంది.శుక్రవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన ముగింపు కార్యక్రమంలో హోమ్ మంత్రి మహమూద్ అలీ, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధుల చేతులు మీదుగా అటవీ శాఖ అధికారులు బహుమతిని అందుకున్నారు. అటవీ శాఖ స్టాల్ ను చక్కగా నిర్వహించి, మొదటి బహుమతి గెల్చుకున్న అధికారులు, సిబ్బందిని పీసీసీఎఫ్ అండ్ హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం. డోబ్రియల్ అభినందించారు.