ఏపీలో ప్రజల నుంచి లంచం తీసుకుంటున్న అధికారులు, ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఆ కార్యాలయాలపై సీబీఐ అధికారులు సైతం తమ దృష్టిని సారించి లంచావతారులను పట్టుకుంటున్నారు. తాజాగా విజయవాడలో అసిస్టెంట్ లేబర్ అధికారి బాపూజీ ఓ ప్రైవేట్ కంపెనీకి లైసెన్స్ రెన్యూవల్ చేసేందుకు లంచం డిమాండ్ చేశాడు.
దీంతో బాధితుడు సీబీఐ అధికారులను ఆశ్రయించగా అధికారులు వ్యూహం ప్రకారం బాధితుడి నుంచి రూ. 25వేల లంచం తీసుకుంటున్న లేబర్ అధికారిని రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. సీబీఐ అధికారులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. విజయవాడలోని అతడి ఇల్లు, కార్యాలయంలో సోదాలు సైతం నిర్వహించారు.