పేపర్‌ ప్లేట్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు పట్టణంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. పట్టణంలోని రంగాచారి వీధిలో ఉన్న ఓ పేపర్‌ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అర్ధరాత్రి 2 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పరిశ్రమ మొత్తానికి వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్‌ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపుచేశారు. మృతులు పరిశ్రమ యజమాని భాస్కర్‌ (65), ఆయన కుమారుడు ఢిల్లీ బాబు (35), బాలాజీ (25)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని భావిస్తున్నారు.