హరితహారం చెట్లను తొలగించిన మునిసిపల్‌ అధికారులు

చౌటుప్పల్‌ పట్టణంలోని ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ ఆవరణలోని హరితహారం చెట్లను మునిసిపల్‌ అధికారులు తొలగించి, తగులబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహి స్తున్న హరిత హారం చెట్లను తొలగించడం పట్ల స్థానికులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మూడు సంవత్సరాల క్రితం కురిసిన బారీ వర్షాలకు బస్‌ స్టేషన్‌ ఆవరణలోకి చెరువు అలుగు నీరు చేరడం, ఈ నీటి కి తోడుగా చెరువు లీకేజీ నీరు సైతం బస్‌ స్టేషన్‌ ఆవరణలోకి నేటికి చేరుతుండడంతో హరితహారం చెట్లు వందకు పైగానే నీటిలో కుళ్లి పోయాయి. మిగిలిన చెట్లను మునిసిపల్‌ అధికారులు, సిబ్బంది తొలగించి సోమవారం తగుల బెట్టారు. మునిసిపల్‌ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ భాస్కర్‌రెడ్డిని వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని అన్నారు. ఈ సంఘటనపై విచారణ చేపడతామని తెలిపారు.