- నర్సింగ్ భట్లలో 48 ఎకరాల భూమి లీజు.. 25 ఏళ్ల వరకూ అనుమతి…
- సాగు, తాగునీరు కలుషితం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న సమీప గ్రామాల ప్రజలు
- కలెక్టరేట్ ఎదుట ధర్నా..
- మైనింగ్ అనుమతులు రద్దయ్యేవరకు పోరాడుతామంటున్న ప్రజలు
నల్లగొండ జిల్లా నర్సింగ్ భట్ల రెవెన్యూ గ్రామ పరిధిలో సుమారు 48 ఎకరాలు భూమిని గాయత్రి మైనింగ్ కంపెనీకి లీజుకు ఇచ్చారు. కంపెనీ వారు 25 ఏళ్ల పాటు భూమిలో తవ్వకాలు చేసుకోవచ్చు. గ్రానైట్ రాళ్లు తరలించుకోవచ్చు. మైనింగ్ తో ముప్పు పొంచి ఉందని సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అనుమతులు రద్దు చేయాలని కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. గ్రానైట్ రాయి తవ్వకాలతో ఊరు బొందల గడ్డగా మారుతుందని.. పచ్చని పంట పొలాలు నాశనమవుతాయంటున్నారు. ఏకపక్షంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి అధికారులు చేతులు దులుపుకొని నిండా ముంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ అనుమతులు రద్దు చేసేంత వరకూ పోరాటం కొనసాగిస్తామంటున్నారు.
మైనింగ్ ఏర్పాటు చేయడం అంటేనే ఆ ప్రాంత ప్రజలజీవితాలతో చెలగాటమాడినట్లే. అధికారులకు అంతా తెలిసి కూడా అధికార పార్టీ నేతలకు సంబంధించిన సంస్థలకు మైనింగ్ కు అనుమతి ఇచ్చారు. దీనివల్ల చుట్టుపక్కలలో ఉన్న పంట పొలాలు, సాగునీటి కాలువలు. చెరువులు పూర్తిగా కాలుష్యం కానున్నాయి. పంటలు పండే అవకాశం కాదు కదా ఆ ప్రాంతమంతా విషతుల్యం కానుంది. తద్వారా ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారనుంది. మైనింగ్ అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత గ్రామాల ప్రజలు కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు.
 25 ఏళ్ల వరకు లీజు.. 
నల్గొండ జిల్లా నల్లగొండ మండలంలోని నర్సింగ్ బట్ల రెవెన్యూ గ్రామ పరిధిలో గల 980/1, 981/1, 980/A, 982/ip. 982/E2, 983/Alp సర్వే నెంబర్లు ఉన్న సుమారు 48 ఎకరాల భూమిని గాయత్రి మైనింగ్ కంపెనీకి 25 సంవత్సరాలు లీజుకు ఇచ్చారు. ఈ భూమి నుంచి బ్లాక్ గ్రానైట్ తీయనున్నారు. భూమి లోపల 25 ఫీట్ల లోతులో రాయి ఉందని చెప్తున్నారు. మొత్తం 48 ఎకరాలు భూమిలో 25 ఫీట్లు లోతు తవ్వాలంటే అందులో వచ్చిన మట్టి ఇతరత్రా రాళ్లు వేరే దగ్గర పోసుకోవడానికి చాలా స్థలం అవసరం ఉంటుంది. కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా భూములు ఖాళీగా లేవు అన్ని మెట్ట, వరి పంట పండే భూములు ఉన్నాయి.
విష వలయంలో ఆ గ్రామాలు…
మైనింగ్ చేసే ప్రాంతానికి చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలు ఒక సాగునీటి కాలువ ఆ పక్కన చెరువు కలిగి ఉంది. నారబోయిన గూడెం 500 మీటర్లు, కూతురు గూడెం 800 మీటర్లు, గూడపూర్ ఒక కిలో మీటర్, నర్సింగ్ పట్ల రెండు కిలోమీటర్లు ఉంది. 200 మీటర్ల దూరంలో బ్రాహ్మణ, వెల్లంల ప్రాజెక్టు నుంచి వచ్చే సాగునీటి కాలువ ఉంది. ఆ నీళ్లన్నీ నర్సింగ్ బట్ల రెవెన్యూ పరిధిలో ఉన్న గంగాదేవి చెరువులోకి వెళ్తాయి. ఈ మైనింగ్ ప్రాంతానికి గంగాదేవి చెరువుకు మధ్యన దూరం కేవలం 300 మీటర్లు దూరమే. గ్రానైట్ తవ్వకాల కోసం బ్లాస్టింగ్ విధానం, కెమికల్ ఉపయోగిస్తారు. దీనివల్ల ఆ ప్రాంతమంతా కెమికల్ వాటర్ తో నిండే అవకాశం ఉంది. ఈ వృథా కెమికల్ వాటర్ అంతా సాగునీటి కాలువ చెరువులోకి పోయే అవకాశం ఉంది. చెరువులోనే నర్సింగ్ పట్ల గ్రామ ప్రజలకు తాగునీటికి సంబంధించిన బోర్లు ఉన్నాయి. సాగునీటి కూడా అదే నీటిని వాడుతున్నారు. దుమ్ము ధూళి చుట్టుపక్కల ఉన్న మెట్ట వరి పంట భూముల పై పడి పంటలు నాశనమవుతాయని రైతులు భయపడుతున్నారు.
బీఆర్ఎస్ నేత కంపెనీ అయినందునే…
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతకు సంబంధించిన గ్రానైట్ కంపెనీ కావడం వలన అధికారులు మైనింగ్ కు అనుమతినిచ్చినట్లు తెలుస్తుంది. నర్సింగ్, బట్ల గ్రామ పంచాయతీ అనుమతి తీసుకొని స్థానికంగా ఉన్న ఎంపీటీసీ ఇతరులకు కనీస సమాచారం లేదు. అంతేకాకుండా మైనింగ్ ప్రభావంతో నష్టపోయే గ్రామాలలో కనీసం విచారణ చేయకుండా ఏక పక్షంగా అనుమతి ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ రోజు కూడా తమ అధికార పార్టీకి చెందిన నాయకులు ఇతరు కొంతమందితో మాత్రమే అభిప్రాయం సేకరించి చేతులు దులుపుకు న్నట్లు తెలుస్తోంది. ఈ మైనింగ్ బాధిత గ్రామపంచాయతీలు అందరితో అనుమతి తీసుకోవాలని స్థానికులు పరిగణలోకి తీసుకోవాలని కోరుతు న్నారు. నాలుగు గ్రామాలకు సంబంధించిన ప్రజలు అఖిలపక్ష పార్టీల నాయకులు నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు పెద్ద ఎత్తున నిర్వహిం చారు, జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసి తమ ప్రాణాలకు నష్టం. కలిగించే మైనింగ్ ను వెంటనే రద్దు చేయాలని కోరారు.
 మైనింగ్ రద్దయ్యే వరకు పోరాటం..
చామకూరి మహేష్ సర్సింగ్ బట్ల మైనింగ్ తో ఈ ప్రాంత ప్రజలకు తీవ్రంగా నష్టం కలిగే ప్రమాదం ఉంది. ఏకపక్షంగా అనుమతి పొందిన మై నింగ్ గ్రానైట్ అనుమతి రద్దయ్యే వరకు పోరాటం కొనసాగిస్తాం. (సోర్స్ దిశ) 
ప్రజల్లో వ్యతిరేకత ఉన్న మైనింగ్ లకు పర్మిషన్లు ఎలా వస్తున్నాయి.. 
ఇలాంటి అక్రమ మైనింగ్ లు తెలంగాణలో చాలానే ఉన్నాయి. తు తు మాత్రంగా పబ్లిక్ హియరింగ్ లు నిర్వహించి..  వాటి పర్మిషన్లు హైదరాబాద్ లోని ఓ ఆఫీసులో భారీగా లంచాలు తీసుకొని నాలుగు గోడల మధ్య కూర్చొని ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకు అక్రమ మైనింగ్ లపై ప్రజల వ్యతిరేకత పట్టదు.. ప్రజల గోస పట్టదు.. వారికి కావల్సినంత మైనింగ్ యజమాన్యం ఇచ్చినందా లేదా అనేదే ముఖ్యం. కోట్లలో సంపాదించుకునే మైనింగ్ యాజమాన్యాలు.. మైనింగ్ పర్మిషన్లు కమిటీ వారికి భారీగానే ముడుపులు అందజేస్తారని వినికిడి.. ఈ ఆఫీసు అడ్రస్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం కూడా లేదు. ఒకవేళ ఎవరైనా పర్యావరణ వేత్తలు తెలుసుకొని అక్రమ మైనింగ్ లపై ప్రజల వ్యతిరేకతను తెలిపి.. ఫిర్యాదు చేస్తే.. ఈ కమిటీ వారు మైనింగ్ యజమాన్యంకు ఫిర్యాదుదారుని ఫోన్ నంబర్ ఇచ్చి దారికి తెచ్చుకోమని చెప్పడం జరుగుతుందని పలువురు పర్యావరణ వేత్తలు చెప్పడం విశేషం. అంతేకాదు ఆర్టిఐ కింద సమాచారం అడిగిన ఈ కమిటీ వారి నుండి సమాధానం ఉండదు. ఈ కమిటీ ఛైర్మన్ మీద సెక్రెటరీ మీద అవినీతి ఆరోపణలు చాలానే వస్తున్నాయి. వారిపై ఏసీబీ, విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో విచారణ జరిపించాలని పలువురు మేధావులు, పర్యావరణ వేత్తలు,  మైనింగ్ వ్యతిరేక కమిటీ సభ్యులు, పొల్యూషన్ బాధితులు కోరుతున్నారు.
