వర్షం వస్తే కాలుష్య పరిశ్రమలకు పండగే…

• కాలుష్య పరిశ్రమల ఆగడాలకు అడ్డుకట్ట వేసేదేవరు…?
• వేస్ట్ కెమికల్స్ ను ట్రీట్ మెంట్ ప్లాంట్లకు పంపకుండా చెరువులు. కుంటల్లోకి వదులుతున్న కాలుష్య పరిశ్రమలు
• కాలుష్య పరిశ్రమలపై ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోని కొందరు పిసిబి అధికారులు
• కాలుష్య పరిశ్రమలతో కుమ్మక్కైన కొందరు పిసిబి అధికారులు

• అడ్డు అదుపులేకుండా భూగర్భ జలాలను కాలుష్యం చేస్తున్న పరిశ్రమలు
• తమకు దేవుడే దిక్కంటున్న కాలుష్య బాధితులు
• ప్రభుత్వం వెంటనే స్పదించి.. కాలుష్య పరిశ్రమలపై.. వాటికి సహకరిస్తున్న కొంతమంది పిసిబి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న పర్యావరణ వేత్తలు, కాలుష్య బాధితులు
• ఈ విషయమై కాలుష్య బాధితులతో ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, పిసిబి ఛైర్మన్, నూతన మెంబర్ సెక్రెటరీలను కలిసే ఆలోచనలో పలువురు పర్యావరణ వేత్తలు

వానలు వస్తే అందరూ పండుగ చేసుకుంటారు. కానీ ఇక్కడి ప్రజలు మాత్రం వర్షాలు రావోద్దని కోరుకుంటారు. కారణం కాలుష్య పరిశ్రమలు వదిలే వ్యర్ధాల వరదతో పాటు, గాలిలోకి వదిలే కాలుష్య వాసనలతో ఇక్కడి ప్రజలు నరకం చూస్తున్నాం అంటున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామిక వాడ, పటాన్ చెరువు, మేడ్చల్, చౌటుప్పల్, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, జిన్నారం, గడ్డపోతారం, బీబీ నగర్, చిట్యాల లాంటి ప్రాంతాలలో కాలుష్య పరిశ్రమల ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోతుంది. కాలుష్య బాధిత ప్రాంతాల ప్రజల కష్టాలు అన్నీ, ఇన్నీ కావు కాలుష్య పరిశ్రమలు వదిలే కాలుష్యంతో భూగర్భ జలాలు విషంగా మారడమే కాకుండా.. గాలి కాలుష్యం కూడా విపరీతంగా చేయడంతో రకరకాల రోగాలతో బాధపడుతున్నాం అని వాపోతున్నారు. బొల్లారం మున్సిపాలిటీ, జిన్నారం, గుమ్మడిదల మండల్లాలోని కిష్టాయి పల్లి, గడ్డపొతారం, బొంతపల్లి, ఖాజీపల్లి, బొల్లారం, పటాన్ చెరువు, మేడ్చల్ మండల పరిధిలో మరియు చౌటుప్పల్ మండల పరిధిలోని దొతిగూడెం, కొయ్యలగూడెం ఇంకా అనేక గ్రామాలు కాలుష్య పరిశ్రమలు వదిలే వ్యర్ధ జలాల వరదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్య పరిశ్రమలు వర్షం పడుతున్న సమయంలో వ్యర్ధ జలాలను వదలడమే కాకుండా, గాలిలోకి కూడా కాలుష్యాన్ని విపరీతంగా వదులుతుండటంతో కాలుష్య పరిసర ప్రాంతాల ప్రజలు ఆ విషపు వాసనలతో నరకం చూస్తున్నాం అంటున్నారు.

ఇందులో మరి ముఖ్యంగా బొల్లారం పారిశ్రామిక వాడను మినీ ఇండియాగా కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం ఆర్ధికంగా ఎంత అభివృద్ది చెందిన కూడా ఇక్కడ నివసించే ప్రజలు పడే ఇబ్బందులను మాత్రం పట్టించుకునే నాదుడే లేడు. మరీ ముఖ్యంగా కొన్ని కాలుష్య పరిశ్రమల యాజమాన్యాలు వర్షాకాలం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. వర్షాలు పడుతుండటమే ఆలస్యం వారి వారి పరిశ్రమలో ఇంతకు ముందు నుంచే నిల్వ ఉంచిన వ్యర్ద జలాలను వర్షపు నీటితో కలిపేసి చుట్టూ ప్రక్కల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలోకి మరియు బోర్ల ద్వారా భూగర్భంలోకి వదులుతూ చెరువులను కుంటలనే కాకుండా భూగర్భ జలాలను కూడా విపరీతంగా కలుషితం చేస్తున్నారు అంటున్నారు. కాలుష్య ప్రాంతాల ప్రజలు పంట పొలాల కోసం, త్రాగు నీటి కోసం బోరులు వేస్తే అందులో నుంచి వచ్చే నీరు కూడా పూర్తిగా విషపు (పసుపు) వ్యర్ధ జలలే వస్తున్నాయి అని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య పరిశ్రమల పరిధిలోని చెరువులు, కుంటలలోని నీరు విషపు వ్యర్ద జలాలతో పూర్తిగా కలుషితం అయిపోయింది అంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి కుంటలు, చెరువులు, నాలాల పక్కనే ఉన్న కాలుష్య పరిశ్రమలు రాత్రి అయ్యేదే ఆలస్యం గుట్టు చప్పుడు కాకుండా తమ దగ్గర నిల్వ ఉంచిన వ్యర్ధ జలాలను వీటిలోకి వదులుతున్నారు. ఈ పరిశ్రమలే కాకుండా సిమెంట్ పరిశ్రమలు కూడా విపరీతమైన కాలుష్యం చేస్తూ పక్కనే ఉన్న కృష్ణ నది స్వచ్చమైన నీటిని కూడా పాడుచేస్తున్నాయి. ఇలాంటి చర్యలతో పూర్తిగా స్వచ్చమైన నీరు కాస్తా వ్యర్ద జలాలుగా మరీ దేనికి పనికి రాకుండా పోవడమే కాక అక్కడ నివసించే ప్రజలకు, పశువులకు, పక్షులకు తాగు నీరు దొరకక విపరీతమైన కొరత ఏర్పడుతుంది అని వారి బాధను పలువులు పర్యావరణ వేత్తల దగ్గర వాపోతున్నారు.

ఈ కాలుష్య ప్రాంతాలలోని ప్రజలు విపరీతమైన కాలుష్య వ్యర్ద జలాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి భూగర్భ జలాలు కలర్ కలర్ గా రావడమే కాకుండా ఈ జలల్లో 2000, 3000 టిడిఎస్ వస్తుంది. ఈ వాటర్ బట్టలు ఉతుకోవడం, స్నానం చేయడానికి కూడా పనికి రాని పరిస్థితి ఉందంటున్నారు. అన్ని అవసరాలకు నీరు కొనుగోలు చేయాలంటే తమ ఆర్ధిక పరిస్థితి సరిపోవడం లేదని అంటున్నారు. మంచి నీరు తెచ్చుకోవాలంటే 5 నుంచి 10 కిలో మిటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుంది అని తమగోడును వెళ్లబోసుకుంటున్నారు. తమ కాలుష్య బాధలను పట్టించుకోవాలని ఎన్ని సార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు కాలుష్య పరిశ్రమలపై ఫిర్యాదు చేసిన సదరు పరిశ్రమలపై చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. ఈ కాలుష్య పరిశ్రమల వ్యర్ద జలాలను పటాన్ చెరువులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిఇటిపికు తరలించాలి. అక్కడ ఆ వ్యర్ధ జలాలను శుద్ది చేయడం జరుగుతుంది. ఈ వ్యర్ద జలాలను సిఇటిపికు తరలించాలి అంటే ఒక్క ట్యాంకర్ కు రూ.10 వేల రూ.15 వేల వరకు చెల్లించాల్సి ఉంటది. ఈ ఖర్చును తప్పించుకోవడానికి కాలుష్య పరిశ్రమలు వర్షపు నీటిలో ఈ వ్యర్ధ జలాలను కలిపి చెరువులు, కుంటలు, నాలాలు, భూగర్భంలోకి వదిలి స్వచ్చమైన నీటిని విషపు నీరుగా మారుస్తున్నారు.

కాలుష్య పరిశ్రమలు ఇంత చేస్తున్న పిసిబి అధికారులు మాత్రం తమకు సంబంధమే లేనట్లు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. కంచె చేను మేస్తున్నట్టుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్ధులోని కొంతమంది అధికారులు అవినీతికి బానిసలై కాలుష్య పరిశ్రమలతో కుమ్మక్కై కాలుష్య బాధితులు, పర్యావరణ వేత్తలు, మేధావులు చేసే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు. పైగా పరిశ్రమలపై ఫిర్యాదులు వస్తే పిసిబి అధికారులే స్వయంగా పరిశ్రమల వారికి తెలియచేస్తు సొమ్ముచేసుకుంటున్నారు అని వినికిడి. కొంతమంది పర్యావరణ ఇంజినీర్లు కొన్ని సంవత్సరాలుగా పిసిబి ఆర్.ఓ.లలో తిష్టవేసి కాలుష్య పరిశ్రమల ద్వారా వచ్చే అవినీతి సొమ్ముతో బాగానే వెనెకేసుకున్నారని అందరి నోట వినిపిస్తున్న మాట. పొల్యూషన్ కంట్రోల్ బోర్ధులోని అవినీతి అధకారులను ప్రక్షాళన చేయకపోతే కాలుష్య పరిశ్రమలు తమ పద్దతిని మార్చుకునే ప్రసక్తే లేదని చెబుతున్నారు. పిసిబి టాస్క్ ఫోర్స్ విభాగంలో కొంతమంది అధికారులకు స్థాన చలనం చేసిన విధంగానే ఆర్.ఓ.లలో కొన్ని సంవత్సరాలుగా ఉన్న కొంతమంది ఇ.ఇ. లను వెంటనే ట్రాన్స్ ఫర్ చేయాలని కాలుష్య బాధితులు కోరుతున్నారు. కాలుష్య పరిశ్రమలపై ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకొని పలువురు అవినీతి పిసిబి అధికారులపై ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి, ప్రిన్సిపాల్ సెక్రటరీ, పిసిబి ఛైర్మన్, ఎసిబి, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ లకు ఫిర్యాదు చేయాలని కాలుష్య బాధితులు, పలువురు పర్యావరణ వేత్తలు సిద్దమవుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కే‌సీఆర్ దృష్టికి తీసుకుపోతేనే ఈ సమస్యకు, పిసిబి అధికారుల అవినీతికి అడ్డుకట్ట పడుతుందని పలువురి నోట వినిపిస్తున్న మాట.

వరద నీటిలోకి కెమికల్స్
* గండిగూడెం చెరువులో వేలాదిగా చనిపోయిన చేపలు
* లక్షల ఆదాయం కోల్పోయామని మత్స్యకారులు ఆవేదన


వరుసగా మూడు రోజుల నుండి కురుస్తున్న వానలు పలు కెమికల్ కంపెనీలకు వరంగా మారుతున్నాయి. కెమికల్ ఇండస్ట్రీస్ లోని ప్రమాదకరమైన వేస్ట్ కెమికల్స్ ను ట్రీట్ మెంట్ ప్లాంట్లకు పంపాల్సి ఉండగా, వరద ప్రవాహంలో కలిపి స్థానికంగా ఉండే చెరువులు. కుంటల్లోకి వదులుతున్నారు. దీంతో ఆ చెరువులలోని వేలాది చేపలు మృత్యువాత పడ్తున్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం దయారా గ్రామపంచాయతీ పరిధిలోని గండిగూడెం చెరువులో గురువారం పరిశ్రమలు వదిలిన కెమికల్స్ వల్ల వేల సంఖ్యలో చేపలు చనిపోయాయి. బొల్లారం, బొంతపల్లి ఇండస్ట్రీయల్ ఏరియాల నుంచి కెమికల్స్ వదలడం వల్లే చేపలు చనిపోయాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినా పీసీబీ ఆఫీసర్లు గాని స్థానిక లీడర్లుగాని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వాన పడిందంటే గొలుసు కట్టు చెరువులకు వేస్ట్ కెమికల్స్ వదులుతున్నారని, ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు తీసు కోవడం లేదని వాపోతున్నారు. రూ.50 లక్షలకు పైగా ఆదాయం కోల్పోయామని తమకు న్యాయం చేసి ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

త్వరలో అతి ఎక్కువ కాలుష్యం చేస్తున్న పరిశ్రమల పేర్లు, వాటికి సహకరిస్తున్న కొంత మంది పిసిబి అధికారుల పేర్లతో సహా పూర్తి ఆధారాలతో మీ ముందుకు తీసుకు వస్తుంది మీ “నిఘా నేత్రం న్యూస్” నిఘా నేత్రం న్యూస్ ఎప్పుడు పేదోడి పక్షమే ఉంటది. మీ సమస్యలు ఏవి ఉన్న మా దృష్టికి తీసుకురండి. మీ తరపున మా టీం పోరాడుతాది. మీ పేరు కూడా గోప్యంగా ఉంచబడుతది.