తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ మేనిఫెస్టోను కాసేపటి క్రితం విడుదల చేశారు. ఆసరా పెన్షన్లు, రైతుబంధు డబ్బుల పెంపుతో పాటు మహిళల కోసం ప్రత్యేక స్కీమ్లు ప్రకటించారు. అర్హులైన మహిళలకు నెలనెలా భృతి అందిస్తామని ప్రకటించారు. అలాగే పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టోలోని మరిన్ని ముఖ్యాంశాలు మీకోసం.
అందరికీ సన్నబియ్యం :
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం
కేసీఆర్ బీమా – ప్రతి ఇంటికి ధీమా :
తెల్లకార్డు కలిగిఉన్న ప్రతి పేద ఇంటికి రైతుబీమా తరహాలోనే ఎల్ఐసీ ద్వారా 5 లక్షల రూపాయల జీవితబీమా
ఆసరా పెన్షన్ల పెంపు :
ఆసరా పెన్షన్లను ఐదేండ్లలో 5 వేల రూపాయలకు తీసుకపోతం. మొదటి సంవత్సరం వెయ్యి పెంచుతం – అంటే 3,016 రూపాయలకు పెంచుకుంటం. దివ్యాంగులకు పెన్షన్ ఈ మధ్యనే 4,016 రూపాయలకు పెంచినం. రాబోయే ఐదేళ్లలో 6,016 రూపాయలకు పెంచుతం
రైతుబంధు సాయం పెంపు :
ఇప్పుడు రైతుబంధు కింద ఇస్తున్న పంట పెట్టుబడి సాయం – ఎకరానికి ఏటా 10,000 రూపాయలు
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే రైతుబంధు సాయాన్ని మొదటి సంవత్సరం ఎకరానికి ఏటా 12,000 రూపాయలకు పెంచుతుందని హామీ ఇస్తున్న.
వచ్చే ఐదేండ్లలో రైతుబంధు సహాయాన్ని క్రమంగా పెంచుతూ.. గరిష్టంగా ఎకరానికి ఏటా 15,000 రూపాయలకు పెంచుతం అని హామీ ఇస్తున్నాం.
ధాన్యం కొనుగోలు పాలసీని యధావిధిగా కొనసాగిస్తాం.
అర్హులైన మహిళలకు నెలకు 3 వేల భృతి :
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలందరికీ ప్రతినెలా 3,000 రూపాయల జీవన భృతిని అందిస్తాం
400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం :
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండరు అందిస్తాం. జర్నలిస్టులకు కూడా రూ. 400కే సిలిండర్
ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షలకు పెంపు :
ఇపుడు ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 5 లక్షలుగా ఉంది. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే ఈ పరిమితిని 15 లక్షలకు పెంచుతుందని హామీ ఇస్తున్నాం.
పేదలకు ఇండ్ల స్థలాలు
రాష్ట్రంలో ఇంటి జాగ లేని నిరుపేదలకు బీఆర్ఎస్ ఇండ్ల స్థలాలు సమకూరుస్తుందని హామీ ఇస్తున్నాం.
ప్రస్తుతం అమలవుతున్న హౌసింగ్ పాలసీ చక్కగా ఉంది కనుక దాన్ని అలాగే కొనసాగిస్తాం.
అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్లు :
అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తాం.
మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు :
రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సమాఖ్యలన్నింటికీ సొంత భవనాలు నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నాం.
అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేత
పట్టాదారుడు అయితే భూమిని అమ్ముకునే అవకాశం ఉంది. కొన్ని చోట్ల రాళ్లు గుట్టలు ఉన్న దగ్గర కూడా కోట్ల రూపాయల డిమాండ్ ఉంది. అటువంటి చోట భూములు అమ్ముకుంటే మరోచోట పదెకరాలు కొనుకుంటున్నారు. కానీ వీళ్లకు అలాంటి సదుపాయం లేదు. దాన్ని రిలీవ్ చేయాలని దళిత సోదరులు కోరుతున్నారు. ఈ అసైన్డ్ భూములపై కూడా పార్టీలతో సంబంధం లేకుండా దళిత ప్రజాప్రతినిధులు అందర్నీ సమావేశపరిచి ఒక పాలసీ రూపొందించి.. అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేసి.. మామూలు పట్టాదారుల్లా హక్కులు కల్పించే ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది.
ఉద్యోగుల సీ.పీ.ఎస్.పై అధ్యయన కమిటీ :
సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు తమకు పూర్వమున్న పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని కోరుతున్నారు. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తాం – నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం.