ఏసీబీకి చిక్కిన రాజన్న సిరిసిల్ల పరిశ్రమల శాఖ మేనేజర్

  • సిరిసిల్లలో రూ.13 వేలు తీసుకుంటూ పట్టుబడిన ఉపేందర్ రావు
  • ఈ నెల 19 న ఏసీబీకి చిక్కిన భూపాలపల్లి ఇండస్ట్రియల్ మేనేజర్
  • ఏసీబీ వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిశ్రమల శాఖ అధికారులు

రాజన్న సిరిసిల్ల పరిశ్రమల శాఖ మేనేజర్ ఉపేందర్ రావు సోమవారం ఏసీబీకి చిక్కాడు. ఓ మహిళ వద్ద రూ.13 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన భూక్యా సరిత సబ్సిడీ కింద టిప్పర్ తీసుకున్నారు. అయితే, ఆ సబ్సిడీకి సంబంధించి వెరిఫికేషన్ జరుగుతోంది. కానీ, సబ్సీడీ రావాలంటే రూ.30 వేలు లంచం ఇవ్వాలని జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఉపేందర్ రావు డిమాండ్ చేశారు. దీంతో సరిత ఏసీబీ అధికారులను ఆశ్రయించా రు. సోమవారం సిరిసిల్లలోని గీతానగర్ జడ్పీ హైస్కూల్లో ఉపేందర్ రావు ఎలక్షన్ డ్యూటీలో ఉండగా భూక్య సరిత మరిది వెంకటేశ్ అతడికి కాల్ చేశాడు. దీంతో బయటకు వచ్చి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేశామని, నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ రమణ మూర్తి తెలిపారు.

ఈ నెల 19 న ఏసీబీకి చిక్కిన భూపాలపల్లి ఇండస్ట్రియల్ మేనేజర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా ఇండస్ట్రియల్ మేనేజర్ గంగాధర శ్రీనివాస్ రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన గుగులోతు లచ్చిరాం గత సంవత్సరం జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా రూ.53 లక్షలకు వ్యాన్ కొన్నారు. దీనికి సంబంధించిన సబ్సిడీ కోసం లచ్చిరాం కొద్ది రోజుల క్రితం జిల్లా పరిశ్రమల శాఖలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ శాఖ ఆఫీసర్ శ్రీనివాస్.. లచ్చిరాం నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. మళ్లీ రూ.60 వేలు కావాలని డిమాండ్ చేయడంతో లచ్చిరాం ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు ఈ నెల 19 న గురవారం లచ్చిరాం రూ.15 వేలను శ్రీనివాస్ కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. నిందితుడిని హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.