ఈ వందేండ్లలో ఈ పదేండ్లే తెలంగాణ ప్రశాంతంగా ఉన్నది.. రాష్ట్రంలో కర్ఫ్యూ లేదు.. లొల్లి లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రం గత పదేండ్ల నుంచి ప్రశాంతంగా ఉంది. ఈ 100 ఏండ్లలో ఈ పదేండ్లే తెలంగాణ ప్రశాంతంగా ఉన్నది. కర్ఫ్యూ లేదు.. పంచాయితీ లేదు.. లొల్లి లేదు. మంచిగా ఉన్నది.. అందరం కలిసిమెలిసి బతుకుతున్నాం. అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు తెల్లారితే కర్ఫ్యూ, మతకల్లోలాలు, ఆ పంచాయితీలన్నీ ఎవరు పెట్టారో ఆలోచించాలి. ఓటు అనేది ముఖ్యం. పాలిటిక్స్ కూడా చాలా ముఖ్యం. రాయి ఏందో.. రత్నం ఏందో గుర్తు పట్టాలి. పార్టీల వైఖరి కూడా చాలా ముఖ్యం అని కేసీఆర్ అన్నారు.
ఈ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న మనోహర్ రెడ్డి విద్యావేత్త. ఎమ్మెల్యే అయ్యాడు. నిస్వార్థంగా పని చేస్తడు. స్వార్థం లేదు. ఈ పదేండ్లలో ఒక్క రోజు కూడా వ్యక్తిగత పనుల గురించి అడగలేదు. పెద్దపల్లి పనులు.. మా ఆయకట్టుకు నీళ్లు వస్తలేవు. మీద మోటార్లు పెడుతున్నారని నాకు చెప్పేవారు. ఇంకేదన్న చేయాలి ఓదెల శ్రీరాంపూర్కు నీల్లు పోవాలని అడిగారు. రైతుల గురించి తపన పడిండు. పదేండ్ల కిందనే రూ. 40 లక్షలు ఖర్చు పెట్టి ప్రతి ఊరికి చెట్లు పంపిణీ చేసిండు. నియోజకవర్గం బాగుపడాలని ఆలోచిస్తడు. ఆయనకు డ్రామాలు, నాటకాలు వేసుడు రాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు. అరమరికలు లేకుండా నిజాయితీగా ఉంటడు. దొంగ ధర్నాలు, దొంగ దీక్షలు చేసుడు ఆయనకు రాదు. సాదాసీదాగా మీ మధ్య ఉండే వ్యక్తి. మీ కోసం పని చేసే వ్యక్తి. లక్ష ఓట్ల మెజార్టీతో మనోహర్ రెడ్డిని గెలిపించాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.