రాష్ట్రంలో పచ్చదనం పెంచే కార్యక్రమాలు కొనసాగాలి : అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖమంత్రి కొండా సురేఖ

  • 33 శాతం పచ్చదనం సాధనకు కృషిచేయాలి
  • ఇసుక మాఫియా ఆటలు కట్టిస్తాం
  • అటవీ అధికారులతో సమీక్షలో మంత్రి సురేఖ

రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంచే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు. హరితహారం పై ఇప్పటి దాకా జరిగిన పురోగతి, రానున్న సీజన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో మంత్రి సమక్షించారు. అటవీ, గ్రామీణ అభివృద్ధి, మునిసిపల్, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, హార్టీ కల్చర్, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అటవీ రక్షణ, పచ్చదనం పెంపు నిరంతరాయ ప్రక్రియ అని మంత్రి తెలిపారు. లక్షిత 33 శాతం పచ్చదనం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మొక్కలు నాటడం, నర్సరీలు, అటవీ సంబంధిత కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంతవరకు తగ్గించాలని మంత్రి సూచించారు. ప్రజలకు ఇంటి అవసరాలకు ఉపయోగపరమైన, అలాగే కనీస ఆదాయాన్నిచ్చే మొక్కలు పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి పూలు పండ్ల జాతుల మొక్కల పంపిణీ తో పాటు, స్వచ్ఛందంగా పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తమ ఆవరణలో చెట్లు నాటుకున్న వాళ్లకు కనీస ఆదాయం వచ్చేలా ప్రోత్సహించాలని తెలిపారు. అందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చింత, సీతాఫల్, ఉసిరి, జామ, నిమ్మ, సపోటా, మునగ, కరివేపాకు లాంటి మొక్కలను పంపిణీ చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కోరారు.

హరితహారం కార్యక్రమం పారదర్శకంగా పూర్తి జవాబుదారీతనంతో ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవన్నారు. గతంలో జరిగిన తప్పులను సవరించుకోవాలని తెలిపారు.ఎప్పటికప్పుడు నాటుతున్న మొక్కలు వాటి ఎదుగుదల, అలాగే చనిపోయిన మొక్కలను మార్చే విధానం అన్ని కూడా వీలైనంత త్వరగా ఆన్ లైన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.సమీక్షా సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పిసిసిఎఫ్ ఆర్.ఎం. దొబ్రియాల్, సుభద్ర, కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇసుక మాఫియా ఆగడాలను సహించం
భద్రాద్రి జిల్లా ఇల్లందు ఫారెస్ట్‌ డివిజన్‌ రేంజ్‌ పరిధిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్‌ అధికారులపై దుండగులు ట్రాక్టర్‌ ఎక్కించి హత్యకు యత్నించిన ఘటనపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వాటిని ప్రభుత్వం సహించబోదని, దోషులు ఎంతటివారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకుంటామని సురేఖ పేర్కొన్నారు.