• లంచం అడిగితే ఫిర్యాదు చేస్తున్న పబ్లిక్
• ఏడాది వ్యవధిలో చిక్కిన పలువురు అవినీతి అధికారులు
• ఏసీబీ దగ్గర మరికొంత మంది అవినీతి అధికారులు చిట్టా ఉందని ప్రచారం
తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది ప్రారంభంలోనే ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏసీబీ వద్ద ఇంకా చాలా మంది అవినీతి అధికారుల చిట్టా ఉందని ప్రచారం జరుగుతుండడంతో లంచగొండి ఆఫీసర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎక్కడ నుంచి ఫిర్యాదులు వెళ్తాయో.. ఎక్కడ దాడులు జరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు. గతేడాదిలో వరుసగా అవినీతిపరులను ఏసీబీ పట్టుకున్న సంగతి తెలిసిందే. రూ. లక్ష చెక్కు వస్తే రూ. 50 వేలు లంచం అడిగిన ఉదంతాలున్నాయి. ఫర్టిలైజర్ షాపు కోసం లైసెన్స్ కావాలంటూ రూ.2 లక్షలు డిమాండ్ చేసిన సంఘటనలు ఉన్నాయి.
2022 అక్టోబర్ 13న ట్రైబర్ వెల్ఫేర్ ఆఫీసర్ మంగ్తా నాయక్ ను ఏసీబీ ఆఫీసర్లు ట్రాప్ చేసి ఆయన వద్ద రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. మంజూరైన రూ. లక్ష బిల్లులో ఆయన రూ. 50 వేలు లంచంగా డిమాండ్ చేశారని, అదే డిపార్ట్మెంట్ కు చెందిన మహిళా ఎంప్లాయ్ ఏసీబీకి పట్టిచ్చారు. ఈ సంఘటన జరిగి వారం తిరగకముందే ఎరువుల షాప్ పర్మిషన్ ఇవ్వడం కోసం రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేయడంతో వ్యాపారులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో అదే నెల 20న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏవో వెంకటేశ్వర్ రెడ్డిని ఏసీబీ ట్రాప్ చేసి రూ. లక్ష స్వాధీనం చేసుకుంది. నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇండ్లపై గతేడాది సెప్టెంబర్ లో ఏసీబీ జరిపిన దాడుల్లో రూ.4.25 కోట్ల ఆస్తులను గుర్తించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. గతేడాది అక్టోబర్ లో ఆలేరు మండలం శారాజీపేటలో సీసీ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.2 లక్షలు లంచం అడిగిన పంచాయతీ రాజ్ ఏఈ రమేశ్ ను ఏసీబీ ట్రాప్ చేసి పట్టుకుంది. తాజాగా నేషనల్ పర్మిట్ క్యాన్సిల్ కోసం వచ్చిన వ్యక్తిని డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో యాదాద్రి డిస్ట్రిక్ ట్రాన్స్ ఫోర్ట్ ఆఫీసర్ వై. సురేందర్ రెడ్డిని శుక్రవారం ఏసీబీ ఆఫీసర్లు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో జిల్లా ఆఫీసర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కావాలని తమను టార్గెట్ చేసుకొని ఏసీబీకి సమాచారం అందిస్తున్నారని కొందరు ఆఫీసర్లు అంటున్నారు. శుక్రవారం జరిగిన ఏసీబీ దాడులు ప్లాన్ ప్రకారం కొందరు ఏజెంట్లు చేయించారని ప్రచారం జరుగుతోంది. అయితే వచ్చిన వ్యక్తిని లంచం అడగకుంటే ఎందుకు టార్గెట్ చేస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రూ. లక్షల్లో జీతాలు తీసుకుంటూ పనుల కోసం వచ్చిన వారిని రూ. వేల కోసం వేధించడం ఎంత వరకూ కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఏసీబీ దగ్గర మరికొంత మంది అవినీతి అధికారులు చిట్టా ఉందని ప్రచారం
వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన ఆఫీసర్లు, స్టాఫ్ తమ వద్దకు వచ్చిన వారిని డబ్బుల కోసం వేధిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. కొందరైతే డబ్బులు తీసుకొని పని చేయడం లేదంటూ తెలుస్తోంది. డిపార్ట్ మెంట్ సమస్యలపై కూడా సొంత స్టాఫ్ వద్ద కొందరు ఆఫీసర్లు ముడుపులు డిమాండ్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఓ డిపార్ట్మెంట్ మెంట్ లో ఓ చిన్న ఉద్యోగి వద్ద రూ. 20 వేలు తీసుకొని పని చేయకుండా తిప్పించిన సంఘటనలు ఉన్నాయని. చివరకు మరో పెద్ద ఉద్యోగి జోక్యం చేసుకుంటే పని జరిగిందని అంటున్నారు. బిల్లుల చెల్లింపు విషయంలో పర్సెంటేజీ ఇస్తేనే సరే అంటూ తిప్పించుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా డీటీవో చిక్కడంతో వివిధ డిపార్ట్మెంట్లకు మరికొందరు ఆఫీసర్లు, స్టాఫ్ చిట్టా కూడా ఏసీబీ వద్ద ఉందని ప్రచారం మొదలైంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనతో ఆఫీసర్లు టెన్షన్ పడుతున్నారు.
2022 ఏసీబీ వరుస దాడుల్లో ఆఫీసర్లు పట్టుబడటం, తోటి ఎంప్లాయ్స్ పట్టించిన ఘటనలు జరిగాయి. అప్పటి ఓ కలెక్టర్ ని కొన్ని డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు కలిసి సొంత స్టాఫే ఆఫీసర్ లను ఏసీబీకి పట్టించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆ కలెక్టర్ సీరియస్ గా స్పందించి.. ‘జీతాలు బాగానే వస్తున్నాయి కదా..? లక్షల్లో జీతాలు తీసుకుంటూ మళ్ళీ లక్షల్లో.. వేలలో ఇలా లంచాలు తీసుకోవడం ఎందుకు.. భయపడడం ఎందుకు..? మీ సబార్డినేట్, ప్రజల వద్ద పలుచన కావడం ఎందుకు..? పై ఆఫీసర్లం అయిన మాకు ఫిర్యాదు ఇవ్వడం. మేము మీకు నోటీసులు ఇవ్వడం లాంటివి తప్ప చర్యలు ఉండటం లేదనే భావనతో ఇవన్నీ ఎందుకన్న ఉద్దేశంతోనే మీ సబార్డినేట్లు మరియు వేరే ఎవరైనా సరే నేరుగా ఏసీబీని ఆశ్రయిస్తున్నట్టుగా కనిపిస్తోందని అన్నట్లు సమాచారం. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకోవాలని ఆ కలెక్టర్ హితవు పలికిన సంగతిని ఎంప్లాయ్స్ గుర్తుకు తెచ్చుకుంటున్నారు.