తెలంగాణ చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఏమున్నయ్‌..? మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌

తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఏమున్నాయని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. శాసన మండలిలో గురువారం తెలంగాణ అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కాకతీయ తోరణంలో ఏం రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. భూమి, నీటిని తల్లితో పోలుస్తాం.. అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో ఓ ప్రొఫెసర్ తెలంగాణ తల్లి ప్రతిమను రూపొందించారని తెలిపారు.

తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ఓ సామాజికవర్గ దొరసాని గుర్తుకు వస్తుందని ప్రభుత్వ పెద్దలు చెప్పడం సమంజసం కాదన్నారు. మంత్రి శ్రీధర్ సమాధానమిస్తూ కాకతీయ తోరణం, తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తామన్నారు. కాకతీయులు, మొగల్ సామ్రాజ్యంలో మంచి, చెడు రెండు జరిగాయని.. చెడు మరోసారి జరుగకుండా చూస్తామన్నారు. ప్రభుత్వమే విగ్రహం తయారు చేయదని.. అన్ని వర్గాల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

సింగిల్‌గా నిర్ణయం తీసుకోమన్నారు. విగ్రహం, చిహ్నం తయారీలో బీఆర్ఎస్ నేతల సలహాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. కాకతీయ రాజులు తెలంగాణ సమాజానికి ఎంతో మంచి పనులు చేశారు. నిజాం రాజులు హైదరాబాద్ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని దేశపతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. రాజీవ్‌ గాంధీ దేశం కోసం చేసిన సేవలపై గౌరవం ఉందని దేశపతి అన్నారు. జాతీయ నాయకుల పేర్లు అనేక వాటికీ పెట్టుకున్నామని.. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్‌కి పెట్టుకున్నామని.. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సిన చోట రాజీవ్‌ విగ్రహం పెట్టడం సరికాదన్నారు.