రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు: సీఎం రేవంత్‌ రెడ్డి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వాతావరణానికి వెళ్లబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్నారు. ఆదిలాబాద్‌లో 800 మెగావాట్ల ఎన్టీపీసీ రెండో విద్యుత్‌ కేంద్రాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అదేవిధంగా రూ.7వేల కోట్ల విలువైలన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై, సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని రాకను 4 కోట్ల మంది ప్రజలు స్వాగతిస్తున్నారు.

ఎన్టీపీసీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఎన్టీపీసీ పవర్‌ ప్రాజెక్టు 4 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉంది. కానీ 1600 మెగావాట్లకు పరిమితిమైందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి పెద్దన్నలా ప్రధాని మోదీ సహకరించాలని కోరారు. హైదరాబాద్‌ మెట్రోకు, మూసీ నది అభివృద్ధికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఎన్‌టీపీసీ రెండో యూనిట్‌ ప్రారంభించామని చెప్పారు. దీంతో 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు. పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గత పదేండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు.