రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ఓ ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం(Bribe) తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి(Panchayat secretary), బిల్‌ కలెక్టర్‌ని ఏసీబీ (ACB)అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని నానాజీపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో హైదరాబాద్‌ నగరంలోని యాకత్‌పూర ప్రాంతానికి చెందిన భర్కత్‌ అలీ అనే వ్యక్తికి 500 గజాల ఫ్లాటు ఉన్నది.

ఆ ఫ్లాటులో ఇంటి నిర్మాణంతో పాటు చుట్టు ప్రహరీ గోడ నిర్మాణం, ఇంటి నంబర్‌ ఇవ్వడానికి బాధితుడు నానాజీపూర్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాధికా రెడ్డిని కలిశారు. ఇందుకు గాను 60వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బాధితుడు చేసేదిలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో డబ్బులు తీసుకుంటుండగా…. కార్యదర్శి, కారోబార్‌లను రెడ్ హ్యాండ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు.