ఏసీబీ దూకుడు..!

  • వరుస దాడులతో అవినీతి అధికారుల భరతం పడుతున్న వైనం
  • ఇటీవల రోజంతా ఆర్టీఏ కార్యాలయాలపై దాడులు
  • ఇప్పుడు గొర్రెల కేసుతో సంచలనం
  • ఏకంగా మాజీ డైరెక్టర్, మంత్రి ఓఎస్టీల అరెస్టుతో సంచలనం
  • రెవెన్యూ, పోలీస్, రవాణా సహా అన్ని శాఖలపై ఏసీబీ అధికారుల ఫోకస్
  • మారు వేషాల్లో వెళ్లి మరీ ఆకస్మిక తనిఖీలు
  • ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల శాఖల్లో అక్రమార్కులే టార్గెట్

తెలంగాణ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) గత కొద్ది నెలలుగా దూకుడు పెంచింది. వరుస తనిఖీలు, ఆకస్మిక ‘ఆపరేషన్’లతో ఏసీబీ అధికారులు హల్ చల్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒకటే రోజు వనపర్తి జిల్లా టీజీ ఎస్పీడీఎల్ ఉద్యోగులు ముగ్గురు, గొర్రెల కుంభకోణంలో ఇద్దరు, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో సీఐ, ఎస్సై, మరో ప్రైవేటు వ్యక్తి కలిపి ముగ్గురు.. గండిపేట్ ఎమ్మార్వో కార్యాలయంలో నలుగురు అధికారులు కలిపి మొత్తంగా 12 మంది అవినీతి అధికారులను కటకటాల వెనక్కి నెట్టారు. ఇక గొర్రెల కుంభకోణం కేసులో పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఓఎస్టీగా పనిచేసిన కళ్యాణ్ ను అరెస్టు చేసి కొరడా ఝుళిపిస్తున్నామనే సంకేతాలనిచ్చింది ఏసీబీ. కొద్ది రోజుల ముందు ఆర్టీఏ కార్యాలయాలు, చెక్ పోస్టులలో ఏకకాలంలో 15 ఏసీబీ అధికారుల బృందాలు 12 ప్రాంతాల్లో సోదాలు చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్లుగా మారు వేషాల్లో వెళ్లి మరీ ఆర్టీఏ చెక్ పోస్టులపై సోదాలు చేయడం గమనార్హం.

ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ రాకతో..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ కు బాధ్యతలు అప్పగించింది. ఆయన కింది స్థాయి అధికారు లకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో క్షేత్రస్థాయిలోని అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఫలితంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 78 కేసులు నమోదు చేయగా.. గతేడాది (2023)లో మొత్తం కలిపి కేసులు 94 మాత్రమే కావడం గమనార్హం. ప్రధానంగా రెవెన్యూ, మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖతో పాటు పోలీస్ శాఖలో అవినీతిపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. దీంతో పాటు ఇటీవల ఆర్టీఏ కార్యాలయాలపై మెరుపు దాడులు చేయడంతో అవినీతికి నిలయాలుగా మారినన మిగతా ప్రభుత్వ శాఖలపైనా ఏసీబీ నజర్ ఉన్నట్టుగా తేటతెల్లం అయ్యింది. రాష్ట్రంలో అవినీతికి మూల కేంద్రాలుగా చర్చ జరుగుతోన్న ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల శాఖలపై కూడా ఏసీబీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ రెండుశాఖలే టార్గెట్గా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినా ఆశ్చర్యపోవక్కర్లేదని తెలుస్తోంది.

చిక్కుతున్న అవినీతి తిమింగలాలు..
ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్ ముందుకు వెళుతుండడంతో అవినీతి తిమింగలాలు విలవిలలాడుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే హెచ్ఎండీఏలో పరాకాష్టకు చేరిన అవినీతి బాగోతం బయటకు లాగారు ఏసీబీ అధికారులు. ఆ శాఖలో అవినీతితో వేళ్లూనుకున్న హెచ్ఎండీఏ టౌన్జనింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు అప్పట్లో పెను ప్రకంపనలు సృష్టించింది.. వందల కోట్ల అవినీతి సొమ్మును వెలికి తీయడంతోపాటు వరుస అరెస్టులు ఈ కేసులో జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 19న రూ.84 వేలు లంచం తీసుకుంటుండగా గిరిజన సంక్షే మశాఖ ఇంచార్జి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ (ఎస్ఈ) జగజ్యోతిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సదరు అధికారి ఇంట్లో సోదాల్లో రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైంది. మార్చిలో జరిపిన ఏసీబీ సోదాల్లో మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా రూ.19 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఉన్నట్టు విశ్వసనీయ సమాచారంతో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్రావు ఇల్లు, బంధువుల ఇళ్లలో చేసిన సోదాల్లో రూ.కోట్ల ఆస్తులతోపాటు, తనతోపాటు అవినీతి భాగస్వాములుగా ఉన్న మరికొందరి పోలీస్ అధికారుల ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించడం సంచలనంగా మారింది.

ప్రజలకు మరింత చేరువయ్యేలా ఏసీబీ
గతంలో ఏసీబీ అధికారులను సంప్రదించేందుకు కేవలం 1064 టోల్ ఫ్రీ నంబర్ మాత్రమే అందుబాటులో ఉండేది. ఇటీవల కాలంలో ప్రజలకు మరింత చేరువయ్యేలా ఏసీబీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. 94404 46106 వాట్సప్ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా www.acb.telangana.gov.in వెబ్ సైట్ లో, ఫేస్ బుక్ http//www.facebook.com/ACBtelanganaలో ‘https://x.com/ Telangana ACB ట్విట్టర్ లో, dg&[email protected] ఈ-మెయిల్ లోనూ ఏసీబీ అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.