తెలంగాణలో 15 మంది ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణలో 15 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్‌ భగవత్‌ బదిలీ అయ్యారు. హోంగార్డులు, ఆర్గనైజేషన్‌ అదనపు డీజీగా స్వాతిలక్రా, గ్రేహౌండ్స్‌ ఏడీజీగా స్టీఫెన్‌ రవీంద్ర నియామకమయ్యారు. పోలీస్‌ పర్సనల్‌ అదనపు డీజీగా విజయ్‌కుమార్‌ను నియమించింది. పోలీస్‌ సంక్షేమం, క్రీడల అదనపు డీజీగా విజయ్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.

టీజీఎస్పీ బెటాలియన్‌ అదనపు డీజీగా సంజయ్‌ కుమార్‌ జైన్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌గా సుధీర్‌బాబు, ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్‌ జోషి, మల్టీజోన్‌-1 ఐజీగా ఎస్‌ చంద్రశేఖర్‌రెడ్డి, రైల్వే, రోడ్‌స్టేఫ్టీ ఐజీగా కే రమేశ్‌ నాయుడు, మెదక్‌ ఎస్పీగా ఉదయ్‌ కుమార్‌రెడ్డి, వనపర్తి ఎస్పీగా ఆర్‌ గిరిధర్‌ను బదిలీ చేసింది. హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బీ బాలస్వామి, వెస్ట్‌జోన్‌ డీసీపీగా జీ చంద్రమోహన్‌, సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ డీసీపీగా రక్షితమూర్తి నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా ఆనంద్‌..
ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ సీవీ ఆనంద్‌కు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.