కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో మృత్యుఘోష కొనసాగుతోంది. మెప్పిడి పరిసర ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున పలుమార్లు కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం నాటికి 300 దాటింది.
ఈ విలయంలో మరణించిన వారి సంఖ్య 308కి చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. మరోవైపు చలియార్ నదిలోనే ఇప్పటివరకు 144 మృతదేహాలు లభ్యమయ్యాయి. సుమారు 200 మందికిపైగా ప్రజలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమాద స్థలం నుంచి సుమారు 1000 మందికిపైగా బాధితులను రెస్క్యూ టీమ్ రక్షించింది.