తెలంగాణ ఉద్యమ చరిత్రలో జయశంకర్‌ సార్‌ది ప్రత్యేక స్థానం: హరీశ్‌రావు

 ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్దాంతకర్త, ఉద్యమ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన మహనీయులని చెప్పారు. ఆయన చూపిన మార్గంలో, కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో జయశంకర్‌ సార్‌ది ప్రత్యేక స్థానమని వెల్లడించారు. జ‌య‌హో జ‌య‌శంక‌ర్‌ స‌ర్.. పి‌డికిలెత్తి ప‌లుకుతోంది తెలంగాణ జోహార్ అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఇక జయశంకర్‌ సార్‌ జయంతిని హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి మండలిలో బీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత మధుసూదనా చారి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, మాజీ మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, పార్టీ నేతలు దేవీ ప్రసాద్‌, వాసుదేవ రెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.