లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి

లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆయనతోపాటు కలెక్టరేట్‌ అధికారిని ఏసీబీ (ACB) అధికారులు అరెస్టు చేశారు. ధరణి వెబ్‌సైట్‌లోని నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమిని తొలగించాలని జక్కిడి ముత్యంరెడ్డి అనే రైతు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌ మోహన్‌ రెడ్డిని కోరారు. అయితే ఈ పనిచేసేందుకు ఆయన రూ.8 లక్షలు డిమాండ్‌ చేశారు. దీంతో ముత్యంరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పథకం ప్రాకారం.. ఆ మొత్తాన్ని సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌ మోహన్‌ రెడ్డి తీసుకుంటుండగా పట్టుకున్నారు.

ఈ క్రమంలో ఆయనను విచారించగా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి చెబితేనే డబ్బులు తీసుకున్నానని అధికారులకు చెప్పారు. వెంటనే అడిషనల్ కలెక్టర్ కి అతనితో ఫోన్‌ చేయించారు. పెద్దఅంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ వద్దకు ఆ డబ్బును తీసుకురావాలని చెప్పాడు. దీంతో మదన్‌మోహన్‌తోపాటు అక్కడికి వెళ్లిన ఏసీబీ అధికారులు.. అతని నుంచి డబ్బులు తీసుకుని తన కారులో పెట్టుకుంటుండగా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌ రెడ్డిని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసిన అనంతరం.. ఇరువురి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో నాగోల్‌లోని అడిషనల్ కలెక్టర్ భూపాల్‌ రెడ్డి ఇంట్లో రూ.16 లక్షల నగదు, కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.