తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి కులగణన సర్వే ప్రారంభం కానున్నది. బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు ఇండ్ల జాబితా నమోదు (హౌస్లిస్టింగ్) కార్యక్రమం చేపడతారు. గ్రామ పంచాయతీ/ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామం (ఆవాసం) పేర్లను కోడ్రూపంలో, వార్డు నంబర్, ఇంటి నంబర్, వీధి పేరు కూడా నమోదు చేస్తారు. ఈ నెల 9 నుంచి ప్రభుత్వం ముద్రించిన ఫార్మాట్లో కుటుంబ వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించి నమోదు చేస్తారు. 56 ప్రధాన ప్రశ్నలు, 19 అనుబంధ ప్రశ్నలు కలిపి మొత్తం 75 ప్రశ్నలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. పార్ట్-1, పార్ట్-2 కింద 8 పేజీల్లో ఆయా వివరాలు పొందుపరుస్తారు.
ఆధార్, ధరణి పాస్బుక్, సెల్ఫోన్ నంబర్లు కూడా నమోదు చేసుకుంటారు. మొత్తం వివరాలు పూర్తి అయ్యాక, తాను చెప్పిన వివరాలన్నీ నిజమేనని ప్రకటిస్తున్నట్టుగా కుటుంబ యజమాని సంతకం తీసుకుంటారు. ఒక్కో కుటుంబం వివరాల నమోదుకు 10-20 నిమిషాలు పట్టే అవకాశం ఉన్నది. ఆధార్ కార్డులు, ధరణి పాస్బుక్లు దగ్గర పెట్టుకుంటే ఎన్యూమరేటర్లు వచ్చినప్పు డు వివరాలు చెప్పడం సులభమవుతుంది. ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించేందుకు ఎన్యూమరేటర్లకు 30 రోజుల గడువు కేటాయించారు. ఒక్కో ఎన్యూమరేటర్ 150 ఇండ్లను సందర్శించాలి.