ఏసీబీకి చిక్కిన మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్

 ఓ కాంట్రాక్టు ఉపాధ్యాయురాలు నుంచి లంచం(Bribe) తీసుకుంటూ ప్రిన్సిపాల్‌ ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మైనార్టీ గురుకుల పాఠశాలలో గురువారం చోటు చేసుకుంది. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఆగస్టు నుంచి కాంట్రాక్టు తెలుగు టీచర్‌గా సంధ్యారాణి పనిచేస్తున్నది. ఆమెకు సంబంధించి నాలుగు నెలల జీతం బిల్లు చెల్లించడానికి ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ భీమనపల్లి కృష్ణ రూ.10 వేలు డిమాండ్‌ చేశాడు.

దీంతో మొదటగా రూ.2 వేలు ఇస్తానని ఒప్పుకున్న సంధ్యారాణి తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. వారు పన్నిన పథకం ప్రకారం గురువారం ఉదయం ప్రిన్సిపాల్‌ కృష్ణకు ఉపాధ్యాయురాలు రూ.2 వేలు లంచం ఇవ్వగా.. ఆ డబ్బులు అటెండర్‌ రామకృష్ణకు ఇవ్వాలని సూచించాడు. దీంతో అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రిన్సిపాల్‌ కృష్ణ, అటెండర్‌ రామకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రమేశ్‌ తెలిపారు.