ఈసారి ఘనంగా రాష్ట్రావతరణ వేడుకలు

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఈసారి ఘనంగా నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. జూన్‌ 2న హైదరాబాద్‌తో పాటు 32 జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ వేడుకను అధికారికంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రసంగిస్తారు. జిల్లాకేంద్రాల్లో పతాకాలను ఆవిష్కరించే మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది.

కలెక్టరేట్లలో జరిగే ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ ప్రత్యేక అధికారులు, మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎ్‌సల చైర్‌పర్సన్లు, మునిసిపల్‌ చైర్‌పర్సన్లు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొనాలని సూచించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని తెలిపింది. ఈమేరకు సీఎస్‌ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, పలువురు ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుంది. తెలంగాణ ఆవిర్భావ దిన్సోతవమైన జూన్‌ 2న ఒక్కొక్కరికీ ఫ్యూచర్‌ సిటీలో 300 గజాల ఇంటి స్థలంతో పాటు రూ.కోటి చొప్పున చెక్కులను అందించనుంది.