ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించే బాధ్యత కలెక్టర్లదే అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కొత్తగా నియమితులైన కలెక్టర్లు సచివాలయంలో మంత్రిని మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల కష్టాలు, బాధలకు విముక్తి కల్పించేలా భూ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
రెవెన్యూ సదస్సుల్లో వస్తున్న దరఖాస్తుల పరిష్కారానికి ఆగస్టు 15 వరకు గడువు విధించినందున న్యాయబద్ధమైన దరఖాస్తులన్నీ పరిష్కరించాలని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన మొదలై ఏడాదిన్నర అయిందని, ఎవరూ ఊహించని రీతిలో భూ సమస్యలను పరిష్కరిస్తూ, సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం చేపడుతోందని వివరించారు.