నల్లగొండ పట్టణంలోని ఆర్పీ రోడ్డులోని పలు చికెన్, కిరాణ స్టోర్, జనరల్ దుకాణాల్లో మున్సిపల్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న రెండు దుకాణాలకు రూ.2 వేల చొప్పున జరిమానాలు విధించారు.
అదనపు కమిషనర్ రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. దుకాణదారులు 120 మైక్రాన్ల కంటే ఎక్కువ ఉన్న ప్టాస్టిక్ కవర్లనే వాడాలన్నారు. తక్కువగా ఉన్న కవర్లు వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోయి పర్యావరణం దెబ్బతింటుందన్నారు. రోజురోజు వాతావరణ కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్లు నంద్యాల ప్రదీప్రెడ్డి, గడ్డం శ్రీనివాస్, మున్షిపల్ సిబ్బంది ఉన్నారు.