జులై, ఆగస్ట్ నెలల్లో వర్షాలు కురియనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాల్లో రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కో రోజు ఒక్కో చోట అంచనాలకు మించిన భారీ వర్షం కురుస్తుంది. అందుకే వర్షాలు కురిసే ఈ రెండు నెలల సీజన్లో అన్ని విభాగాల అధికారులు జిల్లాల్లో అందుబాటులో ఉండాలి. అదమరచి ఉండకుండా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అందించే వర్ష సూచనలను వెంటనే అన్ని గ్రామాలకు చేరవేసేలా కలెక్టర్లు బాధ్యత వహించాలి. దీంతో కనీసం మూడు గంటల ముందే రైతులు, ప్రజలను అప్రమత్తం చేసే వీలుంటుంది.
జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులు, నీరు నిల్వ ఉన్నచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని విభాగాలు మరింత సమర్థంగా పని చేయాలి. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కునేలా జీహెచ్ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్ విభాగాలు, ఎన్డీ ఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా అధ్వర్యంలోని 150 టీమ్లు వెంటనే రంగంలోకి దిగాలి. సిబ్బందితో పాటు అధికారులు నేరుగా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలి. హైదరాబాద్ పరిధిలో పోలీస్ కమిషనర్లతో పాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసేలా జిల్లా కలెక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. వాతావరణ సూచనలకు అనుగుణంగా కమాండ్ కంట్రోల్ రూం నుంచి సమన్వయం చేసుకోవాలి.
జిల్లాల పరిధిలో వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని చోట్ల పిడుగు పాటుతో చనిపోతున్న వార్తలు వస్తున్నాయి. అటువంటి వివరాలను కూడా నమోదు చేయాలి. భవిష్యత్తులో వారికి ప్రభుత్వ పరంగా సాయం అందించే వీలుంటుంది. వర్షాల సీజన్లో డెంగీతో పాటు సీజనల్ జ్వరాలు, అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉండాలి. గిరిజన ప్రాంతాలు, ఐటీడీఏ ఏజెన్సీ ఏరియాలు, మారుమూల ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. పీహెచ్ సీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా ప్రజలకు ఆపద వచ్చినా కలెక్టర్లు వెంటనే స్పందించాలి. ప్రతి జిల్లా కలెక్టర్ ఖాతాలో రూ. కోటి అత్యవసర నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేస్తుంది.
కలెక్టర్లు తమ జిల్లా పరిధిలోని పీహెచ్సీల నుంచి జిల్లా ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీలు చేయాలి. ప్రతి రోజు ఉదయం పూట క్షేత్రస్థాయి పర్యటన చేపట్టాలి. ప్రతీ రోజు కలెక్టర్ల కార్యాచరణకు సంబంధించి సీఎస్ ప్రభుత్వానికి రిపోర్టు అందించాలి. అజాగ్రత్తగా ఉంటే అధికారులు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. జిల్లాల పరిధిలో సాగునీటి ప్రాజెక్టులు, చెర్వులు, కుంటల నీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవాలి. నీటి నిల్వలను అంచనా వేసుకోవాలి. వర్షాలకు అనుగుణంగా నీటి వినియోగ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. చెరువులు, కుంటలకు, కాల్వలకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. కృష్ణా బేసిన్ పరిధిలో ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల కింద నీటి విడుదల మొదలైంది. త్వరలోనే నాగార్జునసాగర్ నీటిని విడుదల చేస్తాం. గత ఏడాది రికార్డు స్థాయిలో 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. యూరియా కృత్రిమ కొరత ప్రచారానికి కలెక్టర్లు అడ్డుకట్ట వేయాలి. కావాల్సినంత యూరియా అందుబాటులో ఉంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆగస్ట్ కోటా కూడా త్వరలోనే రాష్ట్రానికి సరఫరా అవుతుంది.
యూరియా స్టాక్ వివరాలను డీలర్లు, షాప్ల వద్ద బోర్డుపై డిస్ ప్లే చేయాలి. స్టాక్ డిటైల్స్ ఆన్ లైన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలి. యూరియా అమ్మకాలు సాఫీగా సాగేలా రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల డీలర్లు, షాపుల వద్ద ఇద్దరు అధికారులు, ఇద్దరు పోలీసులను అందుబాటులో ఉంచాలి. ఇతర వ్యాపార అవసరాలకు యూరియాను మళ్లిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇటీవలే కేంద్ర మంత్రి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.
వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు యూరియాను మళ్లిస్తే కఠినంగా వ్యవహరించాలి. ఎంతటి వారైనా ఉపేక్షించవద్దు. కేసులు పెట్టాలి. ఎరువులకు సంబంధించి టోల్ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలి. రైతులు, పేద ప్రజల కంటే తమ ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలో విజయవంతంగా ప్రారంభమైంది. సన్న బియ్యం పంపిణీతో గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డులు, రేషన్ షాపుల విలువ పెరిగింది. రాష్ట్రంలో దాదాపు 7 లక్షల కొత్త కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో దాదాపు 31 లక్షల కుటుంబ సభ్యులు లబ్ధి పొందుతారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. పేద ప్రజలు ఆహార భద్రత గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 96 లక్షల కార్డులతో 3.10 కోట్ల మంది సన్న బియ్యం తీసుకుంటున్నారు.
పేదలకు సన్న బియ్యం అందించే ఈ రేషన్ కార్డుల పంపిణీని రాష్ట్రమంతటా ఘనంగా నిర్వహించాలి. ఈ నెల 25వ తేదీ నుంచి ఆగస్ట్ 10వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలి. జిల్లా ఇన్ ఛార్జీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఈ కొత్త కార్డుల పంపిణీలో పాల్గొనాలి. ప్రతీ మండలంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలి. జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక చోట జిల్లా ఇన్ఛార్జీ మంత్రి కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలి. అందుకు వీలుగా షెడ్యూలును కలెక్టర్లు తయారు చేసి రేషన్ కార్డుల పంపిణీ విజయవంతంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి.
సెక్రెటేరియట్ లో నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఏర్పాటు చేసిన ఈ వీడియో కాన్షరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, వాకాటి శ్రీహరి, సీతక్క, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్తగూడెం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఖమ్మం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
