రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రం లో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. Npdcl, Spdcl తో పాటు కొత్తగా ఏర్పాటు చేసే డిస్కమ్ కు వ్యవసాయ ఉచిత విద్యుత్, గృహజ్యోతి లో భాగంగా అందించే 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, స్కూళ్ళు కాలేజీలకు ఉచిత విద్యుత్ పథకాలు కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకు రావాలని సూచించారు.

రాష్ట్రమంతా ఒకే యూనిట్ గా కొత్త డిస్కమ్ పరిధి ఉండాలని ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. దీంతో ఇపుడున్న డిస్కమ్ ల పనితీరు మెరుగుపడుతుందని, జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుందని అన్నారు. Npdcl, Spdcl వాణిజ్య విద్యుత్ కార్యకలాపాలు చేపడుతాయని, కొత్త డిస్కమ్ ప్రభుత్వ సబ్సిడీ పై అందించే విద్యుత్ నిర్వహణ కు వీలుగా విభజన చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. డిస్కమ్ ల ఆర్ధిక స్థితి గతులను మెరుగుపరిచేందుకు సంస్కరణలు తప్పనిసరని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డిస్కమ్ ల పునరవ్యవస్తీకరణ తో పాటు విద్యుత్ సంస్థల పై ఇప్పుడు ఉన్న రుణ భారం తగ్గించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రుణాలపై వడ్డీ భారం తగ్గించేందుకు వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలని అదేశించారు. 10 శాతం వరకు వడ్డీ పై తీసుకున్న రుణాల తో డిస్కమ్ లు డీలా పడ్డాయని.. ఈ రుణాలను 6 శాతం వరకు తక్కువ వడ్డీ ఉండేలా రీ స్ట్రక్చర్ చేసుకోవాలని అదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించిన సీఎం. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని, జిల్లాలవారీగా అనువైన భవనాలను గుర్తించే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు బాధ్యత అప్పగించాలని అధికారులకు సూచించిన సీఎం రేవంత్ రెడ్డి. యుద్ధప్రాతిపదికన అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయానికి సౌర విద్యుత్ అందించాలని, వెంటనే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎండాకాలంలో సచివాలయంలో వాహనాల పార్కింగ్ ఇబ్బందిగా మారిన నేపథ్యంలో సోలార్ రూఫ్ టాప్ షెడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల పార్కింగ్ కు అనువుగా ఉండేలా సోలార్ రూఫ్ టాప్ ను డిజైన్ చేయాలని ఆదేశించారు. విద్యుత్ అవసరాలతో పాటు పార్కింగ్ ఇబ్బందులు తొలిగిపోయేలా సచివాలయం చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఇందిర సోలార్ గిరి జల వికాసం పథకం రాష్ట్రంలోని అన్ని గిరిజన, ఆదివాసీ తండాలు, ఏజెన్సీ ఏరియాల్లో యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూడేళ్లలో 2లక్షల 10వేల మంది ఎస్టీ రైతులకు ఈ పథకం వర్తింపజేయాలని, 6లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ పంపుసెట్లను అందించి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఇంధన శాఖపై జూబ్లీహిల్స్ నివాసంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, GENCO సీఎండీ హరీష్, SPDCL సీఎండీ ముషారఫ్, NPDCL సీఎండీ వరుణ్ రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం, REDCO VC&MD అనిల, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.