హైదరాబాద్‌ అమెరికా కాన్సుల్ జనరల్‌ జెన్నిఫర్ లార్సన్‌కు మంత్రి శ్రీధర్ బాబు ఆత్మీయ వీడ్కోలు

హైదరాబాద్‌ అమెరికా కాన్సుల్ జనరల్‌గా తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న జెన్నిఫర్ లార్సన్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే చేనేత చీరను ఆమెకు బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ – అమెరికా మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసేందుకు ఆమె విశేష కృషి చేశారని కొనియాడారు. విద్య, సాంస్కృతిక మార్పిడి, వాణిజ్య రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. ఆమె అందించిన సహకారం, దార్శనికతకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ తెలంగాణ – అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా సహకారం అందించాలని కోరారు. ఆమె తదుపరి ప్రయాణంలోనూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాక్షించారు.