రూ. 3వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఇరిగేషన్‌ ఏఈఈ మహ్మద్‌ ఫయాజ్‌

ఒకే రోజు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి రెడ్‌హ్యండెడ్‌గా చిక్కారు. జగిత్యాల జిల్లాలో జిల్లా ట్రాన్స్‌ఫోర్టు అధికారి పట్టుబడ్డ కొద్ది గంటల్లోనే మహబూబ్‌నగర్‌ జిల్లా ఇరిగేషన్‌ సబ్‌ డివిజన్‌-1లో ఏఈఈగా పనిచేస్తున్న మహ్మద్‌ ఫయాజ్‌ బుధవారం ఫిర్యాదుదారుడు నుంచి రూ.3 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.

ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీంలో భూమికి సంబంధించిన జాయింట్‌ యాక్షన్‌ రిపోర్టు, ఎన్‌వోసీ ఇవ్వాలని ఏఈఈని కోరాడు. దీంతో లంచం డిమాండ్‌ చేయగా అంగీకరించి ఏసీబీ అధికారులను ఫిర్యాదు చేశాడు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఒకటవ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద రూ. 3 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.

అతడి వద్ద నుంచి రసాయనాలు పూసిన నోట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు, అధికారులు ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసే వారిపై వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. బాధితులు 1064 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించవచ్చని తెలిపారు.