ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి

  • తెలంగాణ నుంచి మరింత బియ్యం ఎగుమతిపై ఇరువురి మధ్య చర్చలు..
  • త్వరలో తెలంగాణ పర్యటనకు ఫ్రాన్సిస్కో పి.టియు లారెల్ జూనియర్

తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ మంత్రి ఫ్రాన్సిస్కో పి.టియు లారెల్ జూనియర్‌ను ఢిల్లీలో కలిశారు. తెలంగాణ నుంచి మరింత బియ్యం ఎగుమతిపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. స్నేహపూర్వక, సహకార వాతావరణంలో ఈ సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి దిగుమతి చేసుకుంటున్న నాణ్యత ఉన్న బియ్యం పట్ల ఫిలిప్పీన్స్ మంత్రి ప్రశంసలు కురిపించారు. తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతుల పరిధిని విస్తరించడానికి ఆయన ఆసక్తి కనబర్చారు.

తమతో భేటీ అవ్వడానికి సమయం కేటాయించినందుకు ఫిలిప్పీన్స్ మంత్రికి.. తెలంగాణ పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. అలాగే తెలంగాణ బియ్యం నాణ్యతను గుర్తించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఫిలిప్పీన్స్ మధ్య వాణిజ్య సంబంధాన్ని విస్తరించడానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఈ ఏడాది చివర్లో తెలంగాణలో పర్యటించాలని ఫిలిప్పీన్స్ మంత్రిని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆహ్వానించారు. దీనిపై ఫ్రాన్సిస్కో పి.టియు లారెల్ జూనియర్‌ సానుకూలత వ్యక్తం చేశారు.

బియ్యంతో పాటు వరి ధాన్యాన్ని ఎగుమతి చేయాలనే తెలంగాణ ప్రతిపాదనపై ఫిలిప్పీన్స్ మంత్రి సానుకూలంగా స్పందించారు. పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్.. తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048) బియ్యం రకాన్ని ఎగుమతి చేసుకోవచ్చని సూచించారు. దీనిపైనా ఫిలిప్పీన్స్ మంత్రి ఆసక్తి చూపించారు. అంతేకాకుండా తెలంగాణ నుంచి మొక్కజొన్నను దిగుమతి చేసుకునే అవకాశం గురించి ఫిలిప్పీన్స్ మంత్రి ఆరా తీశారు. తెలంగాణలో పర్యటించాలని కోరిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని.. ఫిలిప్పీన్స్ మంత్రి వారి దేశంలో పర్యటించాలని ఆహ్వానించారు. వాణిజ్య సంబంధం, సహకారాన్ని మరింతగా పెంచుకోవాలనే బలమైన కోరికను ఇరు పక్షాలు వ్యక్తం చేశాయి. దీంతో ఈ సమావేశం చాలా సానుకూలంగా ముగిసింది.