తెలంగాణలో ఎస్సీల సంక్షేమం కోసం కేంద్ర సాయం విడుదల చేయండి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఈ రోజు మధ్యాహ్నం Ministry of Social Justice & Empowerment, Government of India కేంద్ర మంత్రి కార్యాలయంలో, కేంద్ర మంత్రివర్యులు శ్రీ రాందాస్ అథవాలే గారిని ఢిల్లీలో కలసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఈ కార్యక్రమం లో తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై వినతి పత్రం అందజేశారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి శ్రీ రాందాస్ అథవాలేను కలిసి రాష్ట్రానికి కేంద్ర సహాయం తక్షణం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పీసీఆర్/పీవోఏ చట్టాల అమలుకు రూ.232.68 కోట్లు (మునుపటి బకాయిలతో కలిపి) మరియు పీఎం-AJAY పథకం కింద 2025-26 సంవత్సరానికి రూ.82.20 కోట్లను కేంద్రం నుండి విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రం తన వాటాను చెల్లించిందని, కేంద్ర వాటా ఇప్పటివరకు రిలీజ్ కాలేదని మంత్రి తెలిపారు. ఈ నిధుల విడుదల వల్ల ఎస్సీ వర్గాల న్యాయం, సాధికారత, అభివృద్ధి మరింత బలోపేతం అవుతుందని అన్నారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల కోసం కేంద్ర ఆర్థిక సాయం కోరిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
తెలంగాణలో విద్య ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయాలని యంగ్ ఇండియా పథకం ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 1,023 రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో సుమారు 650 అద్దె భవనాల్లో పని చేస్తున్నాయని, ఇది విద్యా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పారు. ఇప్పటివరకు 55 YIIRS ప్రాజెక్టులకు రూ.200 కోట్ల వ్యయంతో పనులు మంజూరయ్యాయని, ఈ పాఠశాలలు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తాయని మంత్రి తెలిపారు. ఈ యోజనను విజయవంతం చేయడానికి కేంద్రం నుండి ఆర్థిక సహాయం అత్యంత అవసరమని పేర్కొన్నారు.