- చేనేత దినోత్సవం సందర్భంగా పిపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల
- చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ లో 100కు పైగా స్టాల్స్ ను ప్రారంభించి, పరిశీలించిన మంత్రి తుమ్మల
- కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డ్ లకు ఎన్నికైన వారిని సత్కారం
- ఎగ్జిబిషన్ లో భాగంగా ఎలక్ట్రానిక్ మడత ఆసు మిషనును పరిశీలన
- Telanganna authentic weaves లోగోను ఆవిష్కరించిన మంత్రి తుమ్మల
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు, వస్త్రానిచ్చే నేతన్నకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలియజేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపుజీ చేనేత పురస్కారానికి ఎంపికైన చేనేత కళాకారులకు ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. చేనేత దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన వస్త్ర ఎగ్జిబిషన్ లో 100 పైగా స్టాల్స్ ను మంత్రిగారు ప్రారంభించి, వారు తయారుచేసిన చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. ముఖ్యంగా జైలు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్లోని వస్త్రాలను మంత్రిగారు పరిశీలించి అభినందించారు. అంతేకాకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత అవార్డులకు ఎన్నికైన వారు తయారుచేసిన ఉత్పత్తులను పరిశీలించిన ఆయన, వారిని అభినందించారు.
ఈ సందర్బంగా జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. అంతరించిన పోతున్న చేనేత కళలన్నింటికి పునర్వైభవం తెచ్చేలా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వం చేనేత కార్మికుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని అన్నారు. అందులో భాగంగా రెండు సంవత్సరాల కాల వ్యవధితో నేతన్న పొదుపు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. మరణించిన చేనేత కుటుంబానికి అండగా ఉండేలా నేతన్నకు భద్రత పథకం ద్వారా మరణించిన కుటుంబ నామినికి 5 లక్షలు అందజేస్తున్నామన్నారు. మార్చి నెలలో గౌరవ ముఖ్యమంత్రిగారు ప్రకటించిన విధంగా చేనేత రుణమాఫీ కోసం 33 కోట్లు విడుదల చేశామన్నారు. చేనేత కార్మికులకు సంవత్సరానికి 18 వేలు, అనుబంధ కార్మికులకు 6 వేలు వచ్చేలా నేతన్న భరోసా పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ IIHT ని ప్రారంభించి, 120 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం జరిగిందన్నారు. తరువాత మంత్రి మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధిలో మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉందని, అదేవిధంగా జియో ట్యాగింగ్ లో కూడా మనమే ముందున్నామన్నారు. చేనేత అనేది కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదు అని, భారతీయ సంస్కృతికి ప్రతీక అని అన్నారు. ఇది తరతరాలుగా వారసత్వంగా అందిన హస్తకళ. ఈ కళను పరిరక్షించడం బాధ్యత మనందరి మీద ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం చేనేత రంగంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించిందని, గద్వాల, నారాయణపేట, పోచంపల్లి ఇక్కత్, సిద్దిపేట గొల్లభామ, వరంగల్ దర్రిస్, కరీంనగర్ బెడ్షీట్లు వంటి ఉత్పత్తులు అంతర్జాతీయంగా పేరుగాంచాయని పేర్కొన్నారు. చేనేత ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వ శాఖలు టెస్కో ద్వారానే వస్త్రాలను కొనుగోలు చేయాలనే ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. IIHT (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ) ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తూ చేనేత కళను కొత్త తరం వరకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా త్రిళింగ పట్టు చీరలను, Telanganna authentic weaves లోగోను మంత్రిగారు ఆవిష్కరించారు. చేనేత కార్మికులకు ఏ సమస్య వచ్చిన మా ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.