- గాంధీ జయంతి నాటికి అందుబాటులోకి లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలు
- రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలో లైసెన్స్ డ్ సర్వేయర్ల సేవలను అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి మొదటి విడత సర్వేయర్ల శిక్షణ పూర్తయిందని రెండవ విడత శిక్షణ 23 జిల్లా కేంద్రాల్లో ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
అభ్యర్ధులు ఆయా జిల్లాల్లో 18వ తేదీ ఉదయం 10 గంటల లోపు సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ కు రిపోర్ట్ చేయాలని సూచించారు. లైసెన్స్ డ్ సర్వేయర్ల నియామకం పై ఆదివారంనాడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన నేపధ్యంలో ఇందుకు అవసరమైన లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను గాంధీ జయంతి రోజునాటికి అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు.
ఇందుకు సంబంధించి మే 26 నుంచి జూలై 26 వరకు 50 పనిదినాల్లో ఆయా జిల్లా కేంద్రాల్లో ఏడు వేల మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని , గత నెల 28, 29 తేదీల్లో జెఎన్టియు ఆధ్వర్యంలో ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించామని తెలిపారు.
ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్దులకు 40 రోజుల పాటు అప్రెంటిస్ శిక్షణను కూడా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ శిక్షణ పూర్తయిన వెంటనే వీరికి లైసెన్స్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు. వీరి సేవలను పారదర్శకంగా నిర్వహించడానికి వీలుగా సర్వే మాన్యువల్ ను రూపొందించాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ, సర్వే విభాగానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని సర్వే విభాగం బలోపేతం తోనే రెవెన్యూ వ్యవస్ధలో మెరుగైన సేవలు అందించగలుగుతామని దీనిని దృష్టిలో పెట్టుకొని సర్వేవిభాగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. గత పదేళ్ళలో సర్వే విభాగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు.