ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి కాశీం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ఆగస్ట్ 21న ఓయూలో జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావాలని ఆహ్వానం పలికారు. ఓయూలో 80 కోట్ల వ్యయంతో నిర్మాణమై 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు హాస్టల్స్ ను ప్రారంభించి, గిరిజన సంక్షేమం శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు కొత్త హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సీఎం చేతులమీదుగా జరుగనున్నది. ఇప్పటికే ఓయూలో ఉన్న 25 హాస్టళ్లలో 7223 మంది విద్యార్థులకు వసతి ఉండగా సీఎం చేతుల మీదుగా ప్రారంభించే హాస్టల్స్ అదనపు వసతిని సమకూర్చనున్నాయి. ఇదే కార్యక్రమంలో దాదాపు 10 కోట్ల నిధులతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూం పనులకు కూడా సీఎం ప్రారంభించనున్నారు. అదే రోజు ఓయూలో ఉన్న టాగూర్ ఆడిటోరియంలో వెయ్యి మంది ప్రొఫెసర్లను, విద్యార్థులను ఉద్దేశించి “ తెలంగాణ విద్యా రంగంలో రావాల్సిన మార్పులు ప్రభుత్వ ప్రణాళిక” అనే విషయం మీద సీఎం ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొంటారు. ఇరవై ఏళ్ల కాలంలో ఓయూలోకి ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ప్రసంగించనున్న తొలి సీఎం రేవంత్ రెడ్డెనని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో “సీఎం రీసెర్చ్ ఫెలో షిప్ “ తో పాటు విదేశీ పర్యటనకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నామని వీసీ తెలిపారు.
