వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • సత్వరమే నష్ట నివారణ చర్యలు చేపట్టాలి
  • నిరంతర సాగునీటి సరఫరాకు ఆదేశాలు
  • సంవత్సరం పొడవునా నీటి సరఫరాకు నీటిపారుదల ట్యాన్క్ లను నింపండి
  • నష్ట నివారణ పనులలో ఉపేక్షిస్తే సహించేది లేదు
  • బుధవారం రోజున ఎల్లంపల్లి,శ్రీరాంసాగర్,మిడ్ మానేరు ప్రాజెక్టుల సందర్శన

భారీ నుండి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు కృష్ణా,గోదావరి నదుల నీటి ప్రవాహం ఉదృతం అవుతున్న దృష్ట్యా నీటిపారుదల శాఖాధికారులు ఎప్పటికప్పుడు పర్వవేక్షించాలని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరదల ఉధృతికి ఎక్కడైనా గండ్లు పడితే సత్వరం పూడ్చివేత చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున తాజాగా వస్తున్న నీటి ప్రవాహాలతో రాష్ట్రంలోని నీటి ట్యాన్క్ లు అన్ని నింపాలన్నారు.తద్వారా రైతాంగానికి సంవత్సరం పొడవునా నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చేయాలన్నారు.

తాజాగా సంభవిస్తున్న వర్షాలతో గోదావరి జలాశయాలు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపద్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం రోజున పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు,నిజమాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో పాటుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టులను సందర్శించి సమీక్షించ నున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో తాజాగా కురుస్తున్న వర్షాలతో రోజు రోజుకు పెరుగుతున్న నీటి ప్రవహాల ఉధృతి నేపద్యంలో మంగళవారం సాయంత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖా ఇంజినీరింగ్ విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్, ఇ. ఎన్.సీలు అంజద్ హుస్సేన్,శ్రీనివాస్, రమేష్ బాబు లతో పాటు సి.ఇ లు ఎస్.ఇ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా బేసిన్ లో నీటి ప్రవాహాలు గణనీయమైన స్థాయికి చేరుకున్నాయని,జూరాలలో 2.18 లక్షల క్యూసెక్కులు,నాగార్జున సాగర్ లో ఔట్ ఫ్లో 3.95 లక్షల క్యూసెక్కులుగా నమోదు అయిందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో కిందటెడాది ఇదే రోజుకు 192.97 టి.యం.సీలు ఉండగా ఈ సంవత్సరం ఇదే రోజుకు 198.81 టి.యం.సి ల నీరు చేరిందన్నారు.నాగార్జునసాగర్ ప్రాజెక్టులోనూ 312.05 టి.యం.సి ల నీటి సామర్ధ్యనికి గాను ఇప్పటికే 297.15 టి.యం.సీల నీటి నిల్వలు చేరుకున్నాయన్నారు. మరోవైపు తాజా వర్షాలకు గోదావరి బేసిన్ లో కుడా భారీగా నీటి ప్రవహాలు నమోదు అయినట్లు ఆయన వివరించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 90.30 టి.యం.సి నీటి సామర్ధ్యానికి గాను 73.37 టి.యం.సి ల నీరు చేరిందని అదే విదంగా సింగూర్ ప్రాజెక్టులోనూ 19.48 టి.యం.సి ల నీటితో నిండిదన్నారు.గత సంవత్సరంతో పోల్చి చూస్తే 14.91 టి.యం.సి ల నీరు పెరిగిందన్నారు.

ఇదే వరద ప్రవాహాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నీ ట్యాన్క్ లలో సమృద్ధిగా నీరు వచ్చి చేరుతుందన్నారు.మొత్తం రాష్ట్రంలో 34,740 ట్యాన్క్ లు ఉండగా 12,023 ట్యాన్క్ లు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండగా 9,100 ట్యాన్క్ లలో 75 నుండి 100 శాతానికి నీరు చేరుకుందన్నారు.సాగునీటి కి సమృద్ధిగా నీరు అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా నీటి నిర్వహణ చేపడుతున్నామన్నారు. అదే సమయంలో తాజా వర్షాల ఉధృతికి దెబ్బ తిన్న 177 ట్యాన్క్లు ,కాలువలు,లిఫ్టు ల పునరుద్ధరణకు 335 కోట్ల రూపాయల అంచానతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.3,500 చోట్ల తాత్కాలికంగా పునరుద్ధరణ పనులు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.శాశ్వతంగా పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. అదే సమయంలో నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో ఉపేక్షిస్తే సహించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు. వానాకాలం పంటకు సమృద్ధిగా సాగు నీరు అందించేందుకు అధికారులు ప్రణాళికా బద్దంగా వ్యవహరించాలన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటికి 388 టి.యం.సి ల నీటి అవసరం ఉందని గుర్తించామన్నారు.చివరి అంచు వరకు సాగు నీటి సరఫరాకు ఎటువంటి ఆటంకాలు కలుగ కుండా చూడాలని జిల్లా స్థాయి అధికారులకు ఆయన సూచించారు. వానాకాలం తో పాటు యాసంగి పంటలకు సాగు నీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలుగ కుండా ఉండేందుకు గాను గోదావరి జలాలను ఆయా రిజర్వాయర్ లలో నిలువ ఉంచేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను సనకూర్చుకోవలన్నారు. కడెం,ఎల్లంపల్లి లతో పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులలో సమృద్ధిగా నీటిని నిలువ ఉంచడం ద్వారా సంవత్సరం పొడవునా సాగునీరు అందించేందుకు గాను వాటికి అనుబంధంగా ఉన్న చిన్న నీటిపారుదల ట్యాన్క్ లన్నింటిని నింపాలని ఆయన ఆదేశించారు.