వరదల వల్ల రోడ్ల డ్యామేజ్ వివరాల నివేదిక సిద్ధం చేయండి: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

  • స్టేట్ రోడ్స్, NH రోడ్స్, పలు కల్వర్టులు, మైనర్ బ్రిడ్జిల స్థితిగతుల ఫీల్డ్ రిపోర్ట్ తయారు చేయండి
  • అతి త్వరలో హ్యామ్ విధానం ద్వారా మెరుగైన, నాణ్యమైన రోడ్లు వేసుకోబోతున్నాం
  • కేంద్రం నుండి క్లియరెన్స్ రావాల్సిన NH ప్రాజెక్ట్స్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి

డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్ లో గురువారం నాడు ఆర్ అండ్ బి శాఖ పై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ప్రభుత్వ స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, ఈఎన్సి జయ భారతి, సి.ఈ రాజేశ్వర్ రెడ్డి, ఎస్.ఈ ధర్మారెడ్డి పలువురు ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు,వరదల వల్ల ఆర్ అండ్ బి శాఖ పరిధిలోని రోడ్ల డ్యామేజ్ వివరాలపై నివేదిక రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రోడ్ బ్రీచెస్ సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేట్ రోడ్స్,NH రోడ్స్,పలు కల్వర్టులు,మైనర్ బ్రిడ్జిల స్థితిగతుల వివరాలు అడిగిన మంత్రి వాటి లైఫ్ టైమ్ నమోదు చేయాలని సూచించారు. పూర్తి శిథిలావస్థకు చేరిన వాటి స్థానంలో కొత్తగా నిర్మించేందుకు ప్రపోజల్స్ తయారు చేయాలన్నారు. సుమారు 1000 కోట్ల వరకు ఆర్ అండ్ బి శాఖ రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

అతి కొద్ది రోజుల్లోనే హ్యామ్ విధానం ద్వారా మెరుగైన,నాణ్యమైన రోడ్లు వేసుకోబోతున్నామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని, ఈ సీజన్ వర్షాలు తగ్గుముఖం పెట్టగానే పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం పూర్తి ప్రణాళిక బద్దంగా వెళ్తుందని చెప్పారు. కేంద్రం నుండి క్లియరెన్స్ రావాల్సిన NH ప్రాజెక్ట్స్ పై ఆరా తీసిన మంత్రి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. తాను ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర పరిధిలోని ప్రాజెక్ట్స్ పై మాట్లాడానని, రాష్ట్ర ప్రభుత్వం తరుపున విజ్ఞప్తులు కూడా ఇచ్చామని వాటిపై ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి గుర్తు చేశారు. ఖానాపూర్ నుండి బెల్లాం,ఉట్నూర్ నుండి గుడి అత్నూర్ రోడ్ మార్గం పై మంత్రికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వినతి పత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి పై సానుకూలంగా స్పందించారు.