- ఆరోపణలు వస్తే 3 నెలల్లో విచారణ జరగాలి
- గరిష్ఠంగా 6 నెలల్లో తుది నిర్ణయం తీసుకోవాలి
- 15 రోజుల్లో చార్జ్ మెమో ఇవ్వాలని ఆదేశం
- ఉద్యోగులపై ఆరోపణలకు ప్రభుత్వం గడువు.. మార్గదర్శకాలు విడుదల చేసిన చీఫ్ సెక్రటరీ
- ఆరోపణలు అందిన వెంటనే చార్జెస్ నమోదు చేయాలి.
- 30 రోజుల్లో ప్రాథమిక విచారణ పూర్తి కావాలి.
- 15 రోజుల్లో చార్జ్ మెమో జారీ చేయాలి.
- మరో 15 రోజుల్లో ఉద్యోగి వివరణ స్వీకరించాలి.
- ఒక నెలలోపు పూర్తి స్థాయి విచారణ ప్రారంభం కావాలి.
- సాధారణ కేసుల్లో విచారణను మూడు నెలల్లోగా పూర్తిచేయాలి.
- సంక్లిష్టమైన కేసుల్లో ఐదు నుంచి ఆరు నెలల్లోగా పూర్తి చేయాలి.
- పదవీ విరమణ చేసిన ఉద్యోగులపై జరిగే విచారణలకు కూడా ఇదే గడువు వర్తిస్తుంది.
- ఒకవేళ విచారణలో జాప్యం జరిగితే, ఫైల్ ను ముఖ్యమంత్రి/సంబంధిత మంత్రికి పంపి, కేసు పరిష్కారానికి నిర్దిష్ట గడువును తెలియజేసి వారి ఆమోదం పొందాలి.
- అవసరమైతే నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయని విచారణాధికారిపై చర్యలు
ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గురువారం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ జీవో ఎం.ఎస్. నం.175 ఆధారంగా పలు గైడ్లైన్స్ విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం విచారణలో జాప్యం జరగకుండా చూడటం, తద్వారా తప్పుచేసిన వారిపై సకాలంలో చర్యలు తీసుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. నేరం లేదా అవకతవకలు జరిగిన వెంటనే సంబంధిత అధికారిపై అభియోగాలు నమోదు చేయాలి. ప్రాథమిక విచారణ తర్వాత తీవ్రమైన లోపాలు ఉన్నట్టు తేలితే ఆలస్యం చేయకుండా చార్జెస్ వేయాలి. వాటిని స్పష్టమైన, సరైన పదాలతో, సాధారణ భాషలో రూపొందించాలి. విధుల్లో నిర్లక్ష్యం లేదా ప్రవర్తనా నియమాల ఉల్లంఘన వంటి సాధారణ పదాలను వాడకూడదు. ఆ అభియోగాలకు తగినంత డాక్యుమెంటరీ ఆధారాలు ఉండాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి చార్జెస్ తో పాటు, వాటికి సంబంధించిన పత్రాలు, సాక్షుల వాంగ్మూలాల నకళ్లను తప్పనిసరిగా అందించాలి.
ప్రెజెంటింగ్ ఆఫీసర్ నియామకం
కేసును సమర్థంగా విచారించడానికి ప్రెజెంటింగ్ ఆఫీసర్ అనే ఒక ముఖ్యమైన అధికారిని నియమించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఆ అధికారికి కేసు గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఆయనకు అవసరమైన అన్ని రికార్డులు, పత్రాలు సకాలంలో అందించాలి. క్రమ శిక్షణ అధికారులు విచారణ అధికారిని నియమించిన వెంటనే సంబంధిత రికార్డులన్నింటినీ వారికి పంపించాలి. రికార్డులను ముందుగా పరిశీలించకుండా నేరుగా హెచ్ వోడి నుంచి విచారణ అధికారికి పంపించకూడదు. కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలతో సహా సీనియర్ అధికారులు క్రమశిక్షణ కేసులపై వ్యక్తిగత శ్రద్ధ వహించాలి. ఫైళ్లను కేవలం రొటీన్ గా కాకుండా, వాటికి ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు.
అవసరమైతే నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయని విచారణాధికారిపై చర్యలు
విచారణను నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయని విచారణ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అలాగే, క్రమశిక్షణాధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి పదవీ విరమణ తేదీని దృష్టిలో ఉంచుకొని సకాలంలో చర్యలు పూర్తి చేయాలి. ఈ నిబంధనను ఉద్దేశపూర్వకంగా విస్మరించిన వారిని ఆలస్యానికి బాధ్యులను చేస్తారు. క్రమశిక్షణ కేసుల ఫైళ్లను అధికారులు మూడు రోజులకు మించి తమ వద్ద ఉంచుకోకూడదు. మంత్రులకు పంపిన ఫైళ్లను వారంలోగా క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ఈ ఆదేశాలను అన్ని సచివాలయ శాఖలు, హెచ్వోడీలు, జిల్లా కలెక్టర్లు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ చర్యలు క్రమశిక్షణ కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించి, పాలనలో పారదర్శకతను పెంచగలవని ప్రభుత్వం ఆశిస్తున్నది.
విచారణ అధికారి సమయపాలన వివరాలు :
* విచారణ అధికారి నియామకం తర్వాత రెండు వారాల్లోగా విచారణ తేదీని నిర్ణయించడం, పత్రాలను పరిశీలించడం జరిగిపోవాలి.
* పత్రాల పరిశీలన, సాక్షులకు సమన్లు జారీ చేయడం వంటి వాటికి ఒక్కొక్క దానికి రెండు వారాలు.
* రెగ్యులర్ విచారణలు రెండు వారాల్లో పూర్తి కావాలి.
* విచారణ నివేదిక సమర్పణకు రెండు వారాలు
* ఒక వారంలో క్రమశిక్షణ అధికారి నివేదికను పరిశీలించాలి.
* ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి వివరణ ఇవ్వడానికి పదిహేను రోజులు.
* తెలంగాణ విజిలెన్స్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో సంప్రదింపులకు రెండు వారాలు.
* తుది ఉత్తర్వు జారీచేయడానికి రెండు వారాలు. (సోర్స్:NT)