- హెలీ టూరిజం కాన్సెప్ట్ దిశగా తొలి అడుగు
- హైదరాబాద్ – సోమశిల – శ్రీశైలం మధ్య సేవలు
- ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం: పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
సోమశిల, నల్లమల, అమరగిరి ఐలాండ్, ఈగలపెంట ప్రాంతాల్లో వెల్నెస్ & స్పిరిచువల్ రిట్రీట్ ప్రాజెక్ట్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. రూ.68.10 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు. త్వరలోనే తెలంగాణలో హెలీ టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే విధంగా హెలీ టూరిజం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. గగనతలంలో కొద్దిసేపు విహరింపజేసి పర్యాటకులకు అహ్లాదాన్ని, అనుభూతిని కల్పించేందుకు హెలీ టూరిజం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈజ్ మై ట్రిప్ సంస్థ సహకారంతో హైదరాబాద్ నుంచి సోమశిల అక్కడి నుంచి శ్రీశైలం మీదుగా హైదరాబాద్ కు హెలి టూరిజం నిర్వహణకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. దీని వల్ల మన పర్యాటక రంగం కూడా కొత్తమలుపు తిరుగుతుందని, దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. రూ. 68.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సోమశిల వెల్నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టు అభివృద్ధి పనులకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం శ్రీకారం చుట్టారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో అమరగిరిలో రూ. 45.84 కోట్ల వ్యయంతో అమరగిరి ఐలాండ్ వెల్నెస్ రిట్రీట్ నిర్మాణ పనులు, రూ. 1.60 కోట్లతో సోమశిల విఐపీ ఘాట్ – బోటింగ్ పాయింట్ కోసం ట్రెంచింగ్ పనులకు మంత్రి జూపల్లి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… పర్యాటక ఆతిథ్యానికి తెలంగాణ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక పర్యాటక ప్రాజెక్ట్ లు చేపడుతోంది. టూరిజం అభివృద్ధికి తెలంగాణలో అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ గత పదేండ్లలో టూరిజం నిర్లక్ష్యానికి గురైంది. స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు మౌలిక వసతుల కల్పనతో పాటు విస్తృత ప్రచారం నిర్వహిస్తాం. తద్వారా ఉద్యోగ కల్పనతోపాటు ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగవుతాయి. వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ టూరిజానికి పెద్దపీట వేస్తాం.
అమరగిరి ఐలాండ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉంది. ఏడాది లోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. నీటి ప్రవాహం తగిన, పర్యాటకులను ఐలాండ్ తీసుకువచ్చేలా ఫ్లోటింగ్ జెట్టి ఏర్పాటు చేస్తున్నాం. కొత్త పర్యాటక ప్రాజెక్ట్ ల అభివృద్ధి వల్ల పర్యాటకుల సందర్శన మరింత పెరగనుంది. నల్లమల్ల అడవుల మధ్యలో కృష్ణా నది ఒడ్డున ఉన్న సోమశిల, అమరగిరి అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారు. టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధి వల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమశిల- సిద్దేశ్వరం ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం పూర్తైతే దూరాభారం తగ్గడంతో పాటు పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది.
పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యాటక అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, తెలంగాణలో పర్యాటకంలో అగ్ర స్థానంలో నిలబెట్టడానికి కృషి చేస్తున్నారని అన్నారు. నల్లమల సర్క్యూట్ అభివృద్ధితో ఈ ప్రాంతం పర్యాటక హబ్ గా మారుతుందని చెప్పారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.