- తొలగిన కోర్టు స్టే- దరఖాస్తులకు త్వరలో మోక్షం
- రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ :- భూభారతి చట్టం ద్వారా సాదా బైనామాల దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సాదాబైనామాలపై ఉన్న స్టేను రాష్ట్ర హైకోర్టు మంగళవారం నాడు తొలగించిందని ఈ తీర్పు లక్షలాది మంది పేద ప్రజల కలలను సాకారం చేస్తుందన్నారు. సాదా బై నామాల విషయంలో గత ప్రభుత్వం పేద ప్రజలను నమ్మించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరించారని కానీ 2020 ఆర్ ఓ ఆర్ చట్టంలో ఈ దరఖాస్తుల పరిష్కారానికి మార్గం చూపించలేదని విమర్శించారు. ఫలితంగా 9.26 లక్షల దరఖాస్తులు పరిష్కారం కాకుండా పోయాయని దీనిపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. సాదా బైనామాల దరఖాస్తులను పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో తమ ప్రభుత్వం నిరంతరం హైకోర్టులో కేసుకు ముగింపు లభించేలా కృషి చేసిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఈ సమస్యకు పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం భూభారతి చట్టంలో స్పష్టమైన నిబంధనలను పొందుపరిచిందని తెలిపారు. సాదా బైనామాల దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని మంగళవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇప్పటికే ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం అక్రమంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బంగాళాఖాతంలో కలిపేశామని, దేశంలోని 18 రాష్ట్రాలలో అధ్యయనం చేసి భూభారతి -2025 చట్టాన్ని రూపొందించామన్నారు.
రోల్ మోడల్గా నిలిచిన ఈ భూభారతి చట్టం మేరకు రైతన్నల , ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సదస్సులు నిర్వహించగా 8.60 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలపారు. ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపించే తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తుందని అన్నారు.