భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాలపై ప్రాథమిక నివేదికను సమర్పించండి: సి.ఎస్. రామ కృష్ణారావు

  • వివిధ శాఖల కార్యదర్శులతో సి.ఎస్ టెలీ కాన్ఫరెన్స్

హైదరాబాద్ :రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రాథమిక నివేదికను వెంటనే సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామ కృష్ణారావు సంబంధిత శాఖల కార్యదర్శులను ఆదేశించారు. రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలవలన జరిగిన నష్టాలపై వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో నేడు సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, వికాస్ రాజ్, సబ్యసాచి ఘోష్, ముఖ్య కార్యదర్శులు రాహుల్ బొజ్జ, రఘునందన్ రావు, శ్రీధర్ , పోలీస్ శాఖ DGP మరియు అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తదితర ఉన్నతాధికారులు ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రధానంగా నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల జిల్లాలు అధికంగా నష్టాన్ని చవి చూశాయని, వీటితో పాటు ఇతర జిల్లాల్లో కూడా గణనీయమైన నష్టం వాటిల్లిందని అన్నారు. ఈ నష్టాలకు సంబంధించి ప్రాథమిక నివేదికను వెంటనే సమర్పించాలన్నారు. ఈ ప్రాథమిక నివేదికలతో పాటు జరిగిన నష్టాలను తెలియచేసే ఫోటోలు,వీడియో క్లిప్పింగులు, పత్రిక క్లిప్పింగులు కూడా జతపర్చాలని సి.ఎస్ పేర్కొన్నారు. వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత జిల్లా కలెక్టర్లు నష్టాలపై పంపిన ఈ ప్రాథమిక నివేదికలను సంకలనం చేయాలని విపత్తుల నిర్వహణ శాఖ కు తెలిపారు. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, చెరువులు, విద్యుత్ లైన్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్దరించాలని రామకృష్ణారావు ఆదేశించారు. వర్షాలు మరికొన్ని రోజులు వచ్చే అవకాశం ఉన్నందున మరింత అప్రమత్తతతో ఉండాలని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు నిబంధనలను అనుసరించి ఎక్స్ -గ్రేషియా ను అందచేయాలని అన్నారు. ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో సమీక్షించనున్నందున సంబంధిత శాఖలన్ని వివరాలతో, తీసుకున్న చర్యల నివేదికలతో సిద్ధంగా ఉండాలని కోరారు.