తెలంగాణా ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు

హైదరాబాద్ : ఈ నెల 17వ తేదీన నిర్వహించే తెలంగాణా ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఏర్పాట్లపై నేడు డా.బీ.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవీ గుప్తా, డీజీపీ డా. జితేందర్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో సి.ఎస్. రామకృష్ణారావు మాట్లాడుతూ, ఈనెల 17 తేదీన ఉదయం గన్‌పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పిస్తారని, అనంతరం పబ్లిక్ గార్డెన్ లో జరిగే ప్రజాపాలన దినోత్సవం లో పాల్గొంటారని వివరించారు. గన్-పార్క్ వద్ద జరిగే కార్యక్రమానికి జీ.హెచ్.ఎం.సి కమీషనర్ నోడల్ అధికారిగా ఉంటారని, గన్-పార్క్ కు ఫ్లోరల్ డెకరేషన్ తో పాటు, షామియానా తదితర ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా నగరంలోని అని ప్రధాన కార్యాలయాలు, విగ్రహాలు, పర్యాటక ప్రదేశాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని అన్నారు. పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించే సమావేశానికి తగు ఏర్పాట్లను చేపట్టాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా జరిగేలా చూడాలని సి.ఎస్ అధికారులను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు తగు తాగునీరు, శానిటేషన్ ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి వీవీఐపీలతో పాటు ప్రజాప్రతిధులందరికీ ఆహ్వాన పత్రికలను అందచేయాలని ఆదేశించారు. ఈ సమావేశానికి ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, మున్సిపల్ శాఖ కార్యదర్శి ఇలంబర్తి, ప్రోటోకాల్ శాఖ డైరెక్టర్ శివలింగయ్య, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ ప్రియాంక, ఎస్.పి.డీసీ.ఎల్ ఎండి ముష్రారఫ్, జలమండలి ఎండి అశోక్ రెడ్డి తదితర అధికారులు హాజరయ్యారు.